పొల్యూషన్‌ మళ్లీ పరేషాన్‌ | Air Pollution Increasing After Lockdown In Telangana | Sakshi
Sakshi News home page

పొల్యూషన్‌ మళ్లీ పరేషాన్‌

May 23 2020 5:20 AM | Updated on May 23 2020 5:20 AM

Air Pollution Increasing After Lockdown In Telangana - Sakshi

సాక్షి,హైదరాబాద్‌: మళ్లీ వాయు కాలుష్యం పెరిగిపోతోంది. రెండునెలల కాలంలో సాధించిన ఫలితాలు కేవలం రెండ్రోజుల్లోనే నష్టపోయి మునుపటిస్థాయికి చేరుకుంటోంది. ప్రస్తుతం గ్రీన్, ఆరెంజ్‌ జోన్లలో పలు రంగాల కార్యకలాపాలు మొదలుకావడం, రెడ్‌జోన్‌లో లాక్‌డౌన్‌ సడలింపులతో ఒక్కసారిగా వాహనాలు రోడ్లపైకి రావడంతో పాటు, దుమ్ము, ధూళి కణాల విస్తరణ, ఎండ వేడిమి పెరగడం వంటి కారణాలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో గాలినాణ్యత ఒక్కసారిగా పడిపోయింది. దాదాపు 60 రోజులుగా లాక్‌డౌన్‌ కారణంగా స్వచ్ఛమైనగాలి పీల్చుకుంటున్న ప్రజలు మళ్లీ వాయు కాలుష్యాన్ని పీల్చుకోవాల్సిన పరిస్థితులేర్పడ్డాయి.

సడలింపులతో తగ్గిన వాయునాణ్యత 
లాక్‌డౌన్‌ అమల్లో ఉండగా తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, అమరావతి, విశాఖ, రాజమండ్రి, తిరుపతి వంటి నగరాలు, పట్టణాలు వాయునాణ్యత సూచీలో మొదటిసారి ‘గుడ్‌’కేటగిరీ సాధించాయి. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాలతో పాటు దక్షిణాదిలోని నగరాలు కూడా ఈ కోవలోకే చేరాయి. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో వాయునాణ్యత పరిస్థితి కొంత బాగుపడినా, దక్షిణాది నగరాలు మెరుగైన వాయునాణ్యతను సాధించాయి. అయితే లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో శుక్రవారం (మే 22న) దేశంలోని ప్రధాన నగరాలు, అందులోని తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో వాయునాణ్యత తగ్గింది. తిరుపతిలో ఒక మోస్తరు మెరుగైన వాయునాణ్యత నమోదు కాగా దక్షిణాదిలోని త్రివేండ్రం, బెంగళూరులలో దాదాపు ఏప్రిల్‌ 22 నాటి పరిస్థితులే కొనసాగాయి. కొచ్చి, చెన్నైలలో కొంతమేర మాత్రమే వాయునాణ్యత తగ్గింది. గత నెలతో పోల్చితే హైదరాబాద్, రాజమండ్రి, విశాఖ, అమరావతిలలో వాహనాల రద్దీ కారణంగా వాయునాణ్యత తగ్గినట్టుగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) తాజా గణాంకాల్లో వెల్లడైంది.

రంగుల వారీగా వర్గీకరణ ఇలా... 

వాయు నాణ్యత లెక్కింపు ఇలా... 
దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో వాయు నాణ్యతను (ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌– ఏక్యూఐ) కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) వాస్తవ సమయంలో పరిశీలించి ‘సమీర్‌ యాప్‌’ద్వారా ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు వెల్లడిస్తుంటుంది.
► ఏక్యూఐ 50 పాయింట్లలోపు ఉంటే స్వచ్ఛమైన వాతావరణంతో పాటు నాణ్యమైన గాలి ప్రజలకు అందుతున్నట్టు లెక్క.
► 50 – 100 పాయింట్లు నమోదైతే గాలి నాణ్యతగా ఉన్నట్టు లెక్కిస్తారు. 
► 100 పాయింట్లు మించి నమోదైతే ఆయా స్థాయిలను బట్టి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement