ఇక ‘రెవెన్యూ గ్రీవెన్స్’ | Adoption of petitions in RDO offices | Sakshi
Sakshi News home page

ఇక ‘రెవెన్యూ గ్రీవెన్స్’

Aug 27 2014 2:44 AM | Updated on Jul 26 2019 5:59 PM

క్షేత్రస్థాయిలోనే భూ సమస్యల సత్వర పరిష్కారానికి కలెక్టర్ నిర్ణయం పిటిషన్‌లను రెవెన్యూ గ్రీవెన్స్‌లోనే ఇవ్వాల్సి ఉంటుంది.

క్షేత్రస్థాయిలోనే భూ సమస్యల సత్వర పరిష్కారానికి కలెక్టర్ నిర్ణయం పిటిషన్‌లను రెవెన్యూ గ్రీవెన్స్‌లోనే ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
 ఆ గ్రీవెన్స్‌లో ఎవరుంటారు?
 జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం ఆర్డీవో కార్యాలయాల్లో ప్రతి సోమవారం జరిగే ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో రెవెన్యూ ఉన్నతాధికారులంతా పాల్గొంటారు. ఆర్డీవోతో పాటు రెవెన్యూ డివిజన్ పరిధిలోనికి వచ్చే తహశీల్దార్లంతా హాజరవుతారు. వీరితో పాటు అన్ని మండలాలకు చెందిన సర్వేయర్లు కూడా అక్కడే ఉంటారు. జిల్లాలో భూ అంశాలను సమన్వయపరిచే జాయింట్ కలెక్టర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. అయితే, ఆయన ప్రతి వారం ఒక్కో ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి గ్రీవెన్స్‌లో పాల్గొంటారు. అంటే నెలకోసారి ఒక ఆర్డీవో కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్‌కు ఆయన హాజరవుతారు. అక్కడే ఉన్నతాధికారులతో ఆ నెలలో వచ్చిన ఫిర్యాదులు, వినతులను పరిశీలించి సమీక్ష జరుపుతారు.

 పరిష్కరించే అంశాలేంటి?
 ఈ గ్రీవెన్స్‌లో రెవెన్యూ శాఖకు సంబంధించిన అంశాల పిటిషన్లు తీసుకుంటారు. ముఖ్యంగా భూ సమస్యలకు ప్రాధాన్యం ఉంటుంది. సర్వే కాని భూములు, పట్టా పుస్తకాలు ఇవ్వనివి, ఈ పహాణీలు లేనివి, కుటుంబ సభ్యుల వివాదాలు, ప్రైవేటు వ్యక్తులతో వివాదాలు, రిజిస్ట్రేషన్ల సమస్యలకు ఈ గ్రీవెన్స్‌లో పిటిషన్లు తీసుకుంటారని అధికారులు చెపుతున్నారు. వీటితో పాటు రెవెన్యూ శాఖకు సంబంధించిన అన్ని సమస్యలపై ఇక్కడ దరఖాస్తులు ఇవ్వవచ్చు.

 ఆర్డీవో కార్యాలయాల్లోనే ఎందుకు..?
 వాస్తవానికి గ్రీవెన్స్‌డే కింద పిటిషన్ ఇచ్చి జిల్లా కలెక్టర్ దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లాలంటే కలెక్టరేట్‌కు తప్పనిసరిగా రావాల్సి వచ్చేది. ఇప్పుడు ఆర్డీవో కార్యాలయాల్లోనే రెవెన్యూ గ్రీవెన్స్‌ను నిర్వహించడం ద్వారా బాధితుల విలువైన సమయం, డబ్బు వృథా కావనేది అధికారుల ఆలోచన. మళ్లీ ఆ సమస్య పరిష్కారం కాకపోయినా ఖమ్మం వరకు వచ్చే పనిలేకుండా ఆర్డీవో కార్యాలయంలోనో, తహశీల్దార్ కార్యాలయంలోనో వాకబు చేసుకోవచ్చు.

 దీంతోపాటు ప్రతి వారం కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ పిటిషన్‌ల సంఖ్య కూడా తగ్గుతుంది. తద్వారా పిటిషన్‌ల పరిష్కారం సులభమవుతుంది. మరోవైపు ఆర్డీవో కార్యాలయాల్లో పిటిషన్లు ఇవ్వడం ద్వారా క్షేత్రస్థాయిలోనే సమస్యలు పరిష్కరించుకోవచ్చు. ఒకవేళ సమస్య పరిష్కారం కాకుంటే.. పిటిషన్‌దారుడు స్థానిక అధికారులకే పిటిషన్ ఇచ్చాడు కనుక తన పిటిషన్ ఏమైందని అధికారులను ప్రశ్నించవచ్చు. మరోవైపు రెవెన్యూ అధికారుల పనితీరు కూడా సమీక్షల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఆర్డీవో కార్యాలయాల్లోనూ పరిష్కారం కాని పక్షంలో కలెక్టర్ దృష్టికి ప్రభుత్వ అధికారులే సమస్యను తీసుకువస్తారు. ముఖ్యంగా భూసమస్యలు జిల్లాలో ఎక్కువగా ఉన్నాయని గ్రీవెన్స్‌డే పిటిషన్‌లు చెపుతున్నాయి. ఈ సమస్యలపై ప్రతినెలా 4వేల వరకు పిటిషన్లు వస్తున్నాయని అంచనా. ఈ సమస్యలన్నింటినీ ఆర్డీవో కార్యాలయాల స్థాయిలో పరిష్కరించేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా ఉన్నతాధికారులు చెపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement