సాక్షి,హైదరాబాద్: పిల్లిని దత్తత తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు ఓ యువ వైద్యురాలు ప్రాణం తీసుకుంది.
పోలీసుల వివరాల మేరకు.. నగరంలో అల్వాల్ ప్రాంతంలో రిసాలా బజార్ పరిధిలోని శివ్మన్ ప్రైడ్ అపార్ట్మెంట్లో అముదల కుసుమలత కుమార్తె ప్రిన్సీ అలియాస్ శ్రేష్ట (23) నివసిస్తున్నారు.శ్రేష్ట ఇటీవల ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం ప్రయత్నాలు చేస్తోంది.మరో వైపు సొంతంగా ఆస్పత్రి ప్రారంభించి రోగులకు వైద్యం అందించేందుకు అవసరమైన లైసెన్స్ కోసం ప్రయత్నిస్తోంది.
ఇటీవల శ్రేష్ట ఓ పిల్లిని దత్తత తీసుకుంది. దాని బాగోగులు చూసుకుంటుంది. అయితే, పిల్లి పెంపకం ప్రారంభించిన నాటి నుంచి శ్రేష్టకు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో ఆందోళనకు గురైన ఆమె తల్లి కుసుమలత,నాయినమ్మ పిల్లిని పెంచడం ఆపేయాలని నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో శ్రేష్ట మనస్థాపానికి గురైంది.
ఈ నేపథ్యంలో తల్లి,నాయినమ్మ పనినిమిత్తం బయటకు వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చి చూడగా.. సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకొని మృతి చెందింది.స్థానికుల సహాయంతో శ్రేష్టను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే యువతి మరణించినట్లు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం శ్రేష్ట మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


