
పురిటి గడ్డకు రుణపడి ఉంటా
రాజకీయాల్లో ఉన్నత స్థాయికి చేరడానికి సహకరించిన ప్రజలకు, తాను పుట్టిన పరకాల గడ్డకు రుణపడి ఉంటానని తెలంగాణ శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి అన్నారు.
- రాజకీయాల్లోకి రాకుంటే న్యాయవాది అయి ఉండేవాడిని
- పరకాల బిడ్డగా ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతా
- శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి
పరకాల : రాజకీయాల్లో ఉన్నత స్థాయికి చేరడానికి సహకరించిన ప్రజలకు, తాను పుట్టిన పరకాల గడ్డకు రుణపడి ఉంటానని తెలంగాణ శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. స్పీకర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తన స్వగ్రామం నర్సక్కపల్లిలోని తల్లిదండ్రుల సమాధులను దర్శించుకోవడానికి బుధవారం ఇక్కడికి వచ్చారు.
అంతకు ముందు సాయిబాబా దేవాలయం వద్ద టీఆర్ఎస్ నాయకులు స్పీకర్కు ఘనస్వాగతం పలికారు. బస్డిపో వరకు భారీ ర్యాలీ నిర్వహిం చారు. పరకాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్పీకర్తోపాటు ఎంపీలు కడియం, సీతారాంనాయక్లను సన్మానించారు. ఈ సంద ర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించడం, ఆయన నటనపై ఉన్న అభిమానంతో రాజకీయాల వైపు మొగ్గుచూపానని అన్నారు.
ఎన్టీఆర్ ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి వచ్చనట్లు చెప్పారు. ఎంపీ సీతారాంనాయక్ తాను పరకాలలో ఇంటర్ చదివామని, ఈ విషయం చాలా మందికి తెలియదన్నారు. రాజకీయాల్లోకి రాకుంటే తాను న్యాయవాదిని అయిఉండేవాడినని పేర్కొన్నారు. లాయర్లు తనకు మొదటి సన్మానం చేయడం జీవితాంతం గుర్తుంచుకుంటానని చెప్పారు. పరకాలలో కోర్టు ఎక్కడ నడుస్తుందో తెలియని పరిస్థితి ఉందని, దీనికి శాశ్వత పరిష్కారం చేసి చూపిస్తానని తెలిపారు.
గతంలో పరకాలలో రెవెన్యూ డివిజన్ ఉండేదని, ప్రస్తుతం ఆ సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో రెవెన్యూ డివిజన్లు ఏర్పడినా పరకాలకు మాత్రం ఆ అవకాశం దక్కలేదన్నారు. రెవెన్యూ డివిజన్, సబ్కోర్టు ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ పుట్టిన బిడ్డగా అభివృద్ధికి పాటుపడతానని, మీరు చూపించే ఆదరాభిమానాలు ఎప్పటికీ మరిచిపోలేనన్నారు.
కార్యక్రమంలో వరంగల్, మహబూబాబాద్ ఎంపీలు కడియం శ్రీహరి, సీతారాంనాయక్ బార్, మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి, టీఆర్ఎస్ నాయకులు ముద్దసాని సహోదర్రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పున్నం రాజిరెడ్డి, న్యాయవాదులు గట్ల విజయపాల్రెడ్డి, రవీందర్బాబు, మేరుగు శ్రీనివాస్, ఒంటేరు రాజమౌళి, పి.వెంకటరమణ , నెహ్రూనాయక్, బిక్షపతి, చంద్రమౌళి, రాజేందర్, పీఏసీఎస్ చైర్మన్ ఆకుల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
మొదటిసారి చూసి భయపడ్డాను
నేటికీ సజీవంగా కనిపిస్తున్న అమరధామంలోని శిల్పాలను మొదటిసారి చూసి భయపడ్డానని స్పీకర్ అన్నారు. తన తల్లిదండ్రుల సమాధులను సందర్శించి తిరుగు ప్రయాణంలో పట్టణంలోని అమరధామానికి చేరుకున్నారు. ఎంత అద్భుతంగా నిర్మించారో ఆ వీరుల శిల్పాలు కళ్లకు కట్టినట్లు ఉన్నాయంటూ అమరధామం నేలకు దండంపెట్టారు. శిల్పాలపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అమరవీరులకు జోహార్లు అంటూ నినాదాలు చేశారు.