4వ యూనిట్.. ముంచింది


ఆత్మకూర్ : దిగువ జూరాల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలోని 4వ యూనిట్‌లో లోపం కారణంగానే విద్యుత్‌ఉత్పత్తి కేంద్రంలోకి వరద నీరు చేరిందని జెన్‌కో అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. తెలంగాణ జెన్‌కో సీఎండీ ఆదేశాల మేరకు కార్యాలయ డీఈ హనుమాన్ బృందం దిగువ జూరాలను. మూలమల్ల, జూరాల గ్రామాల శివారులో నిర్మిస్తున్న దిగువ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సోమవారం  సందర్శించింది.

 

  ఎగువ జూరాల నుంచి విడుదల చేసిన నీరు  టర్బైన్లలోకి ప్రవేశించకుండా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వాలుకట్టను పరిశీలించారు. అనంతరం పవర్‌హౌస్‌లో ముంపునకు గురైన పరికరాలు పరిశీలించారు. నష్టంపై, సంఘటన వివరాల గురించి కిందిస్థాయి ఉద్యోగులు... ఆల్‌స్ట్రామ్ కంపెనీ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.

 

  ఈ సందర్భంగా డీఈ హనుమాన్‌తోపాటు ఎస్‌ఈలు శ్రీనివాస్, శ్రీనివాసులు మాట్లాడుతూ పవర్‌హౌస్‌లోని ఐదు యూనిట్లలో నీటిని పూర్తిస్థాయిలో తోడేశామని, ప్రమాదానికి కారణమైన నాల్గవయూనిట్ ఒక మీటరు మేర నీరు తోడాల్సి ఉందన్నారు.ఈ నీటిని పూర్తిస్థాయిలో తోడేందుకు సహాయక చర్యలు వేగవంతం చేశామన్నారు. రెండు రోజుల్లో ప్రమాదానికి గల కారణాలను వెల్లడిస్తామన్నారు. నాల్గవ యూనిట్‌లోని 7వ గేటు వద్ద మీటరు మేర కాంక్రీట్ వర్క్ ధ్వంసమై ఉంటుందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు వెల్లడించారు. అనంతరం నీటిలో మునిగిన కంట్రోల్ ప్యానల్‌బోర్డులు, టర్బైన్లను పరిశీలించారు. నవంబర్ చివరి నాటికి విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈలు రమణమూర్తి, రాంభద్రరాజు, వీఆర్క్స్ కంపెనీ ఎండీ సుదర్శన్‌రెడ్డి, డెరైక్టర్ కౌశిక్‌కుమార్‌రెడ్డిలతోపాటు ఆల్‌స్ట్రామ్ కంపెనీ నిర్వాహకులు పాల్గొన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top