విద్యుత్ ఉద్యోగులకు 35 శాతం ఫిట్మెంట్, మూడు వెయిటేజీలు ఇవ్వడానికి ఇంధనశాఖ సిఫారసు చేసింది, దీనిని ఆర్థిక శాఖకు పంపించింది.
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగులకు 35 శాతం ఫిట్మెంట్, మూడు వెయిటేజీలు ఇవ్వడానికి ఇంధనశాఖ సిఫారసు చేసింది, దీనిని ఆర్థిక శాఖకు పంపించింది. మొదట్లో 27.5 శాతం ఫిట్మెంట్ను ఇవ్వాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు విద్యుత్ సంస్థలను ఆదేశించారు. అయితే దీనిపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తమకు ఎన్టీపీసీ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఫిట్మెంట్ తక్కువ ఇవ్వడం సరికాదని సీఎంకు మొరపెట్టుకున్నారు. దీంతో ఉద్యోగులు కోరిన మేరకు 35 శాతం ఫిట్మెంట్ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం కేసీఆర్ సూచించారు. దీంతో ఇంధన శాఖ 35 శాతం ఫిట్మెంట్ ఇవ్వడానికి ఫైలు సిద్ధంచేసి, ఆర్థికశాఖకు పంపించింది.
సబ్సిడీ బకాయిలివ్వకుంటే డిస్కంలకు కష్టం: ప్రభుత్వం తమకు ఇవ్వాల్సిన నెలసరి సబ్సిడీలో కోతలు పెట్టడం వల్ల తమ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా మారుతోందని, సబ్సిడీల మొత్తాన్ని విడుదల చేయాలని డిస్కంలు ఆర్థికశాఖను కోరాయి. డిస్కంలకు సర్కార్ రూ.1,132 కోట్ల బకాయి ఉంది. ప్రతినెలా 399 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా, రూ.208 కోట్లు మాత్రమే విడుదల చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యుత్ పంపిణీ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో సంస్థల మనుగడ కష్టం అవుతుందని ఆర్థికశాఖకు నివేదించాయి.