3 లక్షల మందికి ‘కంటి వెలుగు’ | 3 lakhs treatments in kanti velugu | Sakshi
Sakshi News home page

3 లక్షల మందికి ‘కంటి వెలుగు’

Aug 20 2018 3:25 AM | Updated on Oct 9 2018 7:05 PM

3 lakhs treatments in kanti velugu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘కంటి వెలుగు’ఇంటింటా కొత్త వెలుగును తీసుకొస్తోంది.. ఈ కార్యక్రమంతో పేదలకు ఎంతో మేలు కలుగుతోంది.. కంటి వైద్యశిబిరాలకు జనం భారీగా తరలివస్తున్నారు.. మూడురోజుల్లోనే మూడు లక్షల మంది పరీక్షలు చేయించుకున్నారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ‘ఆరోగ్యశ్రీ’ని ప్రారంభించినప్పటి మాదిరిగా ‘కంటి వెలుగు’కు భారీ స్పందన కనిపిస్తోందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మూడు రోజుల్లో మూడు లక్షల మంది పరీక్షలు చేయించుకున్నారని ప్రజారోగ్య శాఖ సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు.

పరీక్షల వివరాలను ప్రభుత్వానికి నివేదించినట్లు వెల్లడించారు. ఈ నెల 15న కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. శని, ఆదివారాలు సెలవుల అనంతరం సోమవారం నుంచి పరీక్షలు పుంజుకుంటాయని పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల ప్రజలు 8 గంటలకే వచ్చి సాయంత్రం ఐదు దాటినా బారులు తీరుతున్నారని అంటున్నారు. ఒక్కోసారి రాత్రి ఏడు గంటల వరకు శిబిరాలు నడుపుతున్నామని అంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ఆదేశాలు జారీచేసింది.  

బలహీన వర్గాలే అధికం...
కంటి పరీక్షలు చేయించుకున్నవారిలో బడుగు, బలహీన వర్గాలు, పేదలే అధికం. వారిలో వయసు మీరినవారే ఎక్కువ. మూడు లక్షల మందిలో దాదాపు 50 వేల మంది ఎస్సీలు, 18 వేల మంది ఎస్టీలు, లక్షన్నర మంది బీసీలు, మైనారిటీలు దాదాపు 19 వేల మంది ఉన్నారు. దాదాపు 45 వేల మందికి రీడింగ్‌ గ్లాసులు ఇవ్వగా, మరో 48 వేల మందికి కంటి అద్దాల కోసం చీటీ రాసిచ్చారు. 41 వేల మందికి క్యాటరాక్ట్‌ లోపం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మరో 2 వేల మందికి సంక్లిష్టమైన క్యాటరాక్ట్‌ ఉన్నట్లు నిర్ధారించారు. దాదాపు 80 వేల మందికి తదుపరి వైద్య సేవలు అవసరమని గుర్తించారు.

అధికారుల్లో ఆందోళన...
కంటి వెలుగు కార్యక్రమం కింద 40 లక్షల మందికి రీడింగ్‌ గ్లాసులు, మూడు లక్షల మందికి కంటి శస్త్రచికిత్సల అవసరం పడుతుందని అధికారులు భావించారు. శస్త్రచికిత్సలు చేసే క్రమంలో ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని భయపడుతున్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఓ శిబిరంలో 68 ఏళ్ల వృద్ధురాలు చనిపోవడంతో వైద్యాధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి దురదృష్టకర సంఘటనలు జరిగినా ఉపేక్షించబోమని కిందిస్థాయి అధికారులకు సర్కారు హెచ్చరికలు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement