తెలంగాణలో కొత్తగా 15 కరోనా కేసులు | 15 New Corona Positive Cases Recorded In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కొత్తగా 15 కరోనా కేసులు

May 7 2020 8:36 PM | Updated on May 8 2020 1:25 AM

15 New Corona Positive Cases Recorded In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‌రాష్ట్రంలో గురువారం మరో 15 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో 12 మంది జీహెచ్‌ఎంసీ పరిధిలోని వారు కాగా, మరో ముగ్గురు వలస కూలీలు. వారు ముంబైకి వలస వెళ్లిన యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన వారని వైద్య,ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. వారికి ముంబైలోనే కరోనా సోకినట్లు చెబుతున్నారు. ముంబై నుంచి హైదరాబాద్‌కు రాగానే పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలిందని, అనంతరం చికిత్స కోసం పంపినట్లు చెబుతున్నారు. దీంతో మొత్తంగా ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,122కు చేరిందని ప్రజారోగ్య డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌రావు గురువారం బులెటిన్‌లో వెల్లడించారు.

గురువారం 45 మంది కోలుకోగా, ఇప్పటివరకు 693 మంది డిశ్చార్జి అయ్యారని వెల్లడించారు. మొత్తం ఇప్పటివరకు 29 మంది మృతి చెందారని, ప్రస్తుతం 400 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. కాగా, ఇప్పటివరకు మూడు జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాకపోగా, 22 జిల్లాల్లో గత 14 రోజులుగా ఎలాంటి పాజిటివ్‌ కేసులు నమోదు కాలేదని వివరించారు. గురువారం డిశ్చార్జి అయిన వారిలో హైదరాబాద్‌కు చెందినవారు 27 మంది ఉన్నారు. గద్వాల జిల్లాకు చెందిన వారు 8 మంది ఉన్నారు. రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలకు చెందిన వారు ఇద్దరు చొప్పున ఉన్నారు. వికారాబాద్, ఆదిలాబాద్, మేడ్చల్, నల్లగొండ, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన వారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారని వెల్లడించారు.  చదవండి : 6 రోజులు..64 కేసులు

Advertisement
 
Advertisement
Advertisement