మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకం: వెంకయ్య | venkaiah naidu tributes-to-babasaheb-ambedkar | Sakshi
Sakshi News home page

మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకం: వెంకయ్య

Apr 14 2017 4:01 PM | Updated on Sep 5 2017 8:46 AM

బీజేపీ వెనుకబడినవాళ్లకు రిజర్వేషన్ల కల్పనకు అనుకూలమేనని, మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.

హైదరాబాద్‌: బీజేపీ వెనుకబడినవాళ్లకు రిజర్వేషన్ల కల్పనకు అనుకూలమేనని, మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. బీజేపీ కార్యాలయంలో జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు. మతపరమైన రిజర్వేషన్లు సామాజిక అశాంతికి దారి తీస్తాయని, వివిధ వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడుతుందని, వాటిని రాజ్యాంగం ఒప్పుకోదని చెప్పారు. అసమానతలను, కులవివక్షను అంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏ పార్టీ కూడా అంబేద్కర్ ఆలోచనలను వ్యతిరేకించలేదని, సామాజిక అసమానతలు సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు.
 
మత మార్పిడి వివక్షకు సమాధానం కాదన్నారు. అంబేద్కర్ కాంగ్రెస్‌కు రుచించలేదని, కాంగ్రెస్ ఎప్పుడూ అంబేద్కర్‌ను సమర్దించలేదంటూ అంబేద్కర్ చిత్రపటాన్ని పార్లమెంట్‌లో పెట్టడానికి 50 ఏళ్ళు పట్టిందని, భారత రత్న ఇవ్వడానికి 30 ఏళ్ళు పట్టిందని విమర్శించారు. మరో కేంద్ర మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ అంబేద్కర్ అణగారినవర్గాలకు ఆశాజ్యోతి అని కొనియాడారు. సామాజికంగా అసమానతలు లేని వాళ్లకు రిజర్వేషన్లు ఇవ్వొద్దని అంబేద్కర్‌ చెప్పారంటూ మోడీ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తున్నారని చెప్పారు.
 
అంబేద్కర్ ఆలోచనలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే బీజేపీ గట్టిగా పోరాడతుందన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ గత పాలకులు దళితులను ఓటర్లుగానే చూశారని, మోడీ సర్కారు మూడేళ్ల పాలన అవినీతి రహితంగా సాగుతోందని చెప్పారు. మంద కృష్ణ ఉద్యమానికి బీజేపీ మద్దతు ఇస్తుందన్నారు. అంబేద్కర్ ఆశయాలకు తెలంగాణ సర్కార్ తూట్లు పొడుస్తోందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement