వివాహ బంధంతో ఒక్కటైన ఇద్దరు యువతులు | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 14 2019 11:20 AM

Two Girls Married In Kendrapara Orissa - Sakshi

భువనేశ్వర్‌: స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీం కోర్టు గతేడాది వెలువరించిన తీర్పు ఆ ఇద్దరు యువతుల పాలిట వరంగా మారింది. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో.. ఈ తీర్పును అనుసరించి ఒడిశాలోని కేంద్రపారాజిల్లాకు చెందిన ఇద్దరు యువతులు వివాహ బంధంతో ఒక్కటి కావడం స్థానికంగా చర్చనీయాంశం అయింది. వివరాల్లోకి వెళ్తే.. మహాకాపరాకు చెందిన ఓ యువతి, పట్టముండైకు చెందిన మరో యువతి కటక్‌లోని స్కూల్‌లో చదువుకున్నారు. ఆ సమయంలో వారు ఒకరినొకరు ఇష్టపడ్డారు. వారు తమ బంధాన్ని అలాగే కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ విషయాన్ని ఇంట్లో పెద్దలకు తెలుపగా.. వారు అంగీకరిచలేదు. పైగా వారికి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు.

దీంతో వారు పెళ్లి చేసుకోవాలని భావించి కోర్టును ఆశ్రయించారు. ఇద్దరు యువతులు కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసి.. తాము పెళ్లి చేసుకుంటున్నట్టు తెలిపారు. తమ మిగిలిన జీవితం కలిసి కొనసాగిస్తామని.. భవిష్యత్తులో ఎటువంటి గొడవలు జరిగిన వాటిపై ఫిర్యాదు చేయబోమని వారు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ పెళ్లి తన కూతురికి ఇష్టం లేదని ఓ యువతి తండ్రి పోలీసులను ఆశ్రయించినట్టు సమాచారం. మరో యువతి బలవంతంతోనే తన కూతురు ఈ పెళ్లికి అంగీకరించిందని ఆయన ఆరోపించారు.

Advertisement
Advertisement