అమెరికాలో రాజకీయ సమాలోచనలు?

అమెరికాలో తలైవా సమాలోచన? - Sakshi


చెన్నై:  తలైవా అమెరికాలో రాజకీయ సమాలోచనలు జరుపుతున్నారా? ఈ ప్రశ్నకు  మీడియా వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఇటీవల రజనీకాంత్‌ రాజకీయరంగ ప్రవేశం గురించి తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా వాడీ వేడిగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. రజనీకాంత్‌ తన అభిమానులను కలిసిన తరువాత ఆయన రాజకీయరంగ ప్రవేశం గురించి చర్చ మరింత పెరిగింది. కాగా రజనీకాంత్‌ తన తాజా చిత్రం కాలా చిత్రీకరణ కోసం ముంబయి వెళ్లి అనంతరం ఆరోగ్య పరిశోధన రీత్యా తన పెద్ద కూతురు ఐశ్వర్యతో కలిసి అమెరికా వెళ్లారు.



రజనీ అమెరికా వెళ్లినప్పుడల్లా అక్కడ దయానంద సరస్వతి ఆశ్రమంలో బసచేసి ధ్యానం చేయడంతో పాటు అక్కడి వారితో తాను తీసుకునే కొన్ని కీలక నిర్ణయాల గురించి చర్చిండం ఆనవాయితీ. అదే విధంగా ఇప్పుడు తన రాజకీయరంగ ప్రవేశం గురించి సమాలోచనలు చేస్తున్నట్లు సోషల్‌మీడియాలో ప్రచారం హల్‌చల్‌ చేస్తోంది. కాగా అమెరికానుంచి తిరిగొచ్చిన రజనీకాంత్‌ మళ్లీ కాలా చిత్ర షూటింగ్‌లో పాల్గొని చెన్నైకి తిరిగి వచ్చిన తరువాత మరోసారి అభిమానులను కలుసుకోనున్నారు. అప్పుడు తన రాజకీయరంగ ప్రవేశం గురించి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు విశేషకులు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top