దివంగత బాల్ఠాక్రే ఎన్నడూ తన ఛాతి కొలత గురించి ప్రస్తావించలేదని ప్రధాని నరేంద్ర మోదీపై బీజేపీ మిత్రపక్షం శివసేన వ్యంగ్యాస్త్రాలు సంధించింది.
ప్రధాని మోదీపై శివసేన వ్యంగ్యాస్త్రాలు
ముంబై: దివంగత బాల్ఠాక్రే ఎన్నడూ తన ఛాతి కొలత గురించి ప్రస్తావించలేదని ప్రధాని నరేంద్ర మోదీపై బీజేపీ మిత్రపక్షం శివసేన వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఠాక్రే 91వ జయంతి సందర్భంగా శివసేన అధికార పత్రిక ‘సామ్నా’లో ప్రధానిపై విమర్శలు సంధించింది. 2014 లోక్సభ ఎన్నికల ప్రచారంలో తన ‘56 అంగుళాల ఛాతి’ అంటూ మోదీ చేసిన వ్యాఖ్యను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. బాల్ఠాక్రే ఈ విధంగా ఎన్నడూ వ్యాఖ్యానించకపోయినా పాకిస్తాన్ సహా ఇతర శత్రువులు ఆయన పేరు వింటే భయపడేవని పేర్కొంది.
2002లో గోద్రా అల్లర్లు జరిగినప్పుడు అప్పటి బీజేపీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీని తొలగించాలని ప్రయత్నించినప్పుడు ఠాక్రే అడ్డుపడ్డారని గుర్తు చేసింది. ఆ సమయంలో మోదీకి బాలాసాహెబ్ మద్దతుగా నిలవడం చాలా ధైర్యమైన విషయమని పేర్కొంది. ఠాక్రేకు మోదీ నివాళి అర్పించినా శివసేన ఆయనపై ఎదురుదాడికి దిగడం గమనార్హం. దీంతో రానున్న ముంబై నగర పాలక ఎన్నికల్లో బీజేపీతో శివసేన పొత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి.