
‘స్టేలు తెచ్చుకోవడంలో చంద్రబాబు గిన్నిస్ రికార్డు’
ప్రత్యేక హోదాపై ప్రవాసాంధ్రులు అడిగిన ప్రశ్నలకు వైఎస్ జగన్ సవివరంగా సమాధానాలిచ్చారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన తక్షణ ఆవశ్యకతను నొక్కి చెప్పడానికి వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ప్రవాసాంధ్రులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులు అడిగిన ప్రశ్నలకు వైఎస్ జగన్ సమాధానాలు ఇచ్చారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నందుకు జననేతను ఎన్నారైలు అభినందించారు. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత వైఖరి తూర్పారబట్టారు. భవిష్యత్ ఉద్యమ కార్యచరణ ఏవిధంగా ఉండబోతుందని వైఎస్ జగన్ ను అడిగారు. ప్రవాసులు అడిగిన ప్రశ్నలకు వైఎస్ జగన్ సవివరంగా సమాధానాలిచ్చారు.
రమేష్(వాషింగ్టన్ డీసీ)
రమేష్: ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ లో చెప్పారు కానీ హోదా ఇవ్వలేదు. ప్రతిపక్ష నేతగా మీరు ఎలాంటి పోరాటం చేస్తారు.?
జగన్: పోరాటం చేయకపోతే ఈ అంశం కోల్ట్ స్టోరేజ్ లోకి ఈ విషయం వెళ్తుంది. వివిధ స్థాయిల్లో ఇప్పటికే పోరాటం చేసాం. ప్రత్యేక హోదా ఎన్నిరోజుల్లో వస్తుందో చెప్పలేను. అసాధ్యం అనుకున్న తెలంగాణను వారు సాధించుకున్నారు. అలాంటప్పుడు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన మాటను మనం తెచ్చుకోలేమా. హోదా ఇచ్చే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తాం. హోదాపై చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారు. ఇలా ఎందుకు చెబుతున్నానంటే అరుణ్ జైట్లీ సెప్టెంబర్ 7న ప్రకటన తర్వాత స్వాగతిస్తున్నానని చంద్రబాబు స్వయంగా స్వాగతించారు. హోదా తో ఏం వస్తుందని శాసనమండలిలో ప్రశ్నించారు. మండలిలో ఏకంగా హోదా వల్ల ఏం వస్తుందని ప్రశ్నించారు. ఇంగ్లీష్ వచ్చి ఉంటే జైట్లీ గారు చెప్పింది అర్థమై ఉండాలి.
వాసుదేవరెడ్డి(అమెరికా)
వాసుదేవరెడ్డి: ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేస్తున్నారు కదా.. మిమ్మల్ని అడ్డుకుంటున్నారు. అయితే తెలంగాణ కోసం కేసీఆర్ పోరాటం చేసినట్లుగా మీరు ఏదైనా ప్రత్యేక పోరాటం చేయనున్నారా?
జగన్: అరుణ్ జైట్లీ స్టేట్ మెంట్ చూస్తే.. ఆయనకు ఎవరూ థ్యాంక్స్ చెప్పరు. కేంద్రం ఏమీ ఇవ్వకపోయినా మన హక్కు ప్రకారం రావాల్సినది ఏదీ ఇవ్వకున్నా.. ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన సాధారణ ప్యాకేజీలు ఇచ్చారు. మనకు ప్రత్యేకంగా వారు చెప్పినట్లు ఎక్కువ మొత్తంలో ఏమైనా ఇస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారికి థ్యాంక్స్ చెప్పాలి. కానీ అలాంటి పరిస్థితులు లేవు. మీరు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించకుండా కేంద్రంతో చంద్రబాబు రాజీపడుతున్నారు. మేం ఏదైనా దీక్ష చేపడితే.. మోదీ వస్తారు.. లేక మరెవరో వస్తారని సాకులు చెప్పి కుట్ర పన్ని దీక్ష భగ్నం చేస్తారు. ఇప్పటికే రెండున్నరేళ్లు గడిచిపోయింది. చంద్రబాబులో, కేంద్రంలో గానీ మార్పులు రాకపోతే.. మా పోరాటం ఉధృతం చేస్తాం. కొన్ని దశలుగా పోరాటం కొనసాగిస్తాం.. మా ఎంపీలతో రాజీనామాలు చేయిస్తాం. దీనిపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటాం.
వెంకట్(శాన్ ఫ్రాన్సిస్కో)
వెంకట్: ఎన్నికల సమయంలో చెప్పిన వాగ్దానాలు, హోదా లాంటివి నెరవేర్చలేదు. అమెరికాలో ఉన్నట్లుగా నేతను రీకాల్ చేయవచ్చా?
జగన్: అమెరికాలో ఉన్నట్లుగా ఇక్కడ అవకాశం లేదు. అబద్దాలు చెప్పే నేతలున్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజల మ్యాండెట్ అనేది చాలా ముఖ్యం. విశ్వసనీయత అనేది చాలా ముఖ్యం. ఎంత కాలం బతికామన్నది ముఖ్యం కాదు ఎలా బతికామన్నది ముఖ్యం.
రమేశ్ (వాషింగ్టన్ డీసీ)
రమేశ్: స్టేలు తెచ్చుకోడంలో చంద్రబాబు గిన్నిస్ రికార్డు సాధించారు. ప్రత్యేక హోదా కోసం భవిష్యత్ లో ఎలా పోరాడతారు?
జగన్: ప్రత్యేక హోదా కోసం ప్రణాళికాబద్ధంగా ఉద్యమాలు చేస్తున్నాం. భవిష్యత్ లో పోరాటం మరింత ఉధృతం చేస్తాం.
ప్రభాకర్ (న్యూజెర్సీ)
ప్రభాకర్: ప్రత్యేక హోదాపై ఒకే ఒక్కడుగా పోరాటం చేస్తున్నారు. కాంగ్రెస్, వామపక్షాలని కలుపుకుని పోయే ప్రణాళిక ఉందా?
జగన్: రాజకీయ పక్షాల్ని, ప్రజా సంఘాలు, ఇతర సంస్థలతో మమేకమై పోరాటం చేస్తున్నాం. దానివల్లే ఇప్పటివరకూ జరిగిన బంద్ లు అన్నీ విజయవంతమయ్యాయి. మా ఒక్కరివల్లే సాధ్యం కాదని తెలుసు. అందుకే హోదా కోసం మా వెంట వచ్చే అందరితోనూ చర్చించి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లామని జగన్ తెలిపారు.
ప్రసాద్(కొలంబస్)
ప్రసాద్: 2019లో అధికారంలోకి వస్తే మీరు ప్రత్యేక ప్యాకేజీని.. కేంద్రంతో చర్చించి ప్రత్యేక హోదా తీసుకొస్తారా?
జగన్: అరుణ్ జైట్లీ ప్రకటన చూస్తే విషయం అర్థమవుతోంది. వారు ప్రత్యేకంగా ఏం ఇవ్వకపోగా ఉన్న వాటికే కోత విధించారు. అసలు దీన్ని ప్రత్యేక ప్యాకేజీ అని ఎలా అంటున్నారో. ప్రత్యేక హోదా ఉన్న జమ్ముకశ్మీర్ కు ప్రధాని మోదీ 80వేల కోట్లు ఇచ్చారు. అంతమాత్రాన ప్రత్యేక హోదా తీసేశారా? కేంద్రంలో భవిష్యత్ లో ఏ ప్రభుత్వం వచ్చినా ఏ కూటమికి 280 సీట్లు వచ్చే పరిస్థితి లేదు. 25కు 22 లేదా 23 సీట్లు సాధించి కేంద్రంలో మనం నిలబడాలని పిలుపునిలబితే అప్పుడు మనం కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తే హోదా తప్పకుండా వస్తుంది.
ప్రదీప్(లండన్)
ప్రదీప్: చంద్రబాబు స్థానంలో ఉంటే మీరు ఏం చేస్తారు?
జగన్: నేను ఆయన స్థానంలో ఉంటే కేంద్రంలోని మా మంత్రులతో రాజీనామా చేయిస్తాను. రెండున్నరేళ్లు విపరీతమైన అవినీతికి పాల్పడ్డారు. నోటుకు కోట్లు కేసులో ఇరుక్కుని ఉన్నారు. దాంతో కేంద్రంపై ఒత్తిడి తేలేకపోతున్నారు.
సంతోష్(సింగపూర్)
సంతోష్: మరో రెండున్నరేళ్లు మాత్రమే అధికారంలో ఉంటారు. వారికి ఇప్పడు కావాల్సిన ప్యాకేజీ వస్తుంది. సింగపూర్ అంటే ప్రపంచ పటంలో ఓ చిన్న పాయింట్ లాంటిది. ఎంతో పెద్దదైనా రాష్ట్రం ఏపీని సింగపూర్ లా చేస్తామని చెప్పడం విడ్డూరమన్నారు.
90 శాతం పనులు జరిగిన దాన్ని ఇప్పుడు చూపించి ఐదారు పంపులు పెట్టి, పట్టిసీమ తానే చేశానని చెప్పుకుంటున్నారు. ఇందులో ఆయన చేసింది ఏముంది?
జగన్: మీరు చెప్పిన విషయం వింటే బాబుకు జ్ఞానోదయం అవుతుంది. అవినీతిని ప్రశ్నిస్తే.. అడ్డుపడుతున్నాడని అంటారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ చేయించడం, ప్రాజెక్టుల విషయంలో నిధుల దుర్వినియోగం ఇలా ఏ విషయాన్ని లేవనెత్తినా పట్టించుకోవడం లేదు. తాను ఏం చేసినా ప్రజలు నమ్మేస్తారన్న భ్రమలో ఇంకా ఉన్నారు.
నటరాజ్ (అమెరికా)
నటరాజ్ : ప్రత్యేక హోదాకు, ప్రత్యేక ప్యాకేజీకి తేడా ఏంటి? ప్రజలకు ఈ విషయం ఎలా అర్థమవుతుంది?
జగన్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఉండేందుకు ప్యాకేజీ అనే కొత్త పదాన్ని తెరమీదకు తెచ్చారు. వాస్తవానికి ప్యాకేజీ అనేది అబద్ధం. ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ మెత్తంలో ఏదైనా ఇస్తే దాన్ని మనం ప్యాకేజీ అనాలి. కానీ అర్ధరాత్రి పూట ఏదో ఓ ప్రకటన చేశారు. ఏపీకి రావాల్సిన ప్రయోజనాలను ఇవ్వకపోగా, ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రత్యేక ప్యాకేజీ అని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. వెంకయ్యనాయుడు గతంలో చెప్పిన మాటపై స్పందిస్తూ.. ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతుందని ఆయన గతంలో చెప్పారు. రాష్ట్రానికి హోదా ఇవ్వలేదు. హోదా వస్తే ఆదాయపన్ను, ఎక్సైజ్ పన్నులపై 100 శాతం మినహాయింపు ఉంటుంది. దాంతో పాటు జీఎస్టీ ప్రభావం కూడా రాష్ట్రంలో ఉండదు.