నామ్‌దేవ్ ఢసాల్ ఇకలేరు | Namdeo Dhasal passes away | Sakshi
Sakshi News home page

నామ్‌దేవ్ ఢసాల్ ఇకలేరు

Jan 16 2014 12:10 AM | Updated on Sep 2 2017 2:38 AM

ప్రముఖ కవి, దళిత పాంథర్ సంస్థపాకుడు పద్మశ్రీ నామ్‌దేవ్ ఢసాల్(64) బుధవారం తెల్లవారు జామున కన్నుమూశారు.

సాక్షి, ముంబై: ప్రముఖ కవి, దళిత పాంథర్ సంస్థపాకుడు పద్మశ్రీ నామ్‌దేవ్ ఢసాల్(64) బుధవారం తెల్లవారు జామున కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా ఆయన క్యాన్సర్‌తో బాదపడుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో  సోమవారం ముంబైలోని బాంబే ఆస్పత్రిలో చేర్పించారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడంతో వెంటనే ఐసీయూలోకి మార్చారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని గురువారం ఉదయం 11 గంటలకు ప్రజల సందర్శనార్థం వడాలాలోని అంబేద్కర్ కళాశాల ప్రాంగణంలో ఉంచనున్నారు. ఆ తరువాత శివాజీపార్క్‌లోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారని ఆయన సన్నిహితులు తెలి పారు. పుణే జిల్లాలోని ఓ కుగ్రామంలో 1949, ఫిబ్రవరి 15న జన్మించారు. బతుకుదెరువు కోసం ముంబై చేరుకున్న ఢసాల్ దళితుల న్యాయం కోసం అనేక పోరాటాలు చేశారు. 1972లో దళిత్ పాంథర్‌ను స్థాపించి రాష్ట్ర రాజకీయాలతోపాటు కేంద్రంలో కూడా తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తరువాత అనేక మంది నాయకులు ఆయణ్ని విడిచిపెట్టి సొంతంగా పార్టీలు పెట్టుకున్నారు. అయినప్పటికీ కడ వరకూ ఆయన పాంథర్‌లోనే కొనసాగారు.
 
 ముంబై టీ జాక్ సంతాపం
 ఢసాల్ మృతి పట్ల పలువురు నాయకులు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ముంబై తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసిన సంతాప సభలో పలువురు ఢసాల్ సేవలు, త్యాగాలను మరోసారి నెమరేసుకున్నారు. దళిత సమాజం కోసం ఆయన చేసిన పోరాటలు చిరస్మరణీయంగా ఉంటాయని కొనియాడారు. ఢసాల్ మృతిపై ప్రొఫెసర్ కోదండరామ్, కంచె ఐలయ్య తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు ముంబై టీ జాక్ అధ్యక్షుడు మూల్‌నివాసి మాల తెలిపారు. ఈ కార్యక్రమంలో బి.హేమంత్‌కుమార్, సంగెవేని రవీంద్ర తదిత రులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement