
రాడో వాచీలు.. స్కాచ్ విస్కీ బాటిళ్లు.. పంచిపెడుతున్నారు
పెద్దల సభలోకి వెళ్లాలంటే ఓటర్లకు 'పెద్ద'గా ఖర్చు పెట్టాలని వివిధ పార్టీల నాయకులు భావించినట్లున్నారు.
బెంగళూరు : పెద్దల సభలోకి వెళ్లాలంటే ఓటర్లకు 'పెద్ద'గా ఖర్చు పెట్టాలని వివిధ పార్టీల నాయకులు భావించినట్లున్నారు. అనుకున్నదే తడవుగా అలా ఇలా కాదు అత్యంత ఖరీదైన బహుమతులు అందిస్తూ... ఓటర్ల 'మతి' పోగోడుతున్నారు. పార్టీని బట్టి ఓటర్లకు చిన్న... పెద్ద నజరానాలు అందుతున్నాయి. పెద్ద పార్టీ అయితే స్విస్ రాడో వాచీలు అందిస్తూ... ఓటర్లను ఆకట్టుకుంటుంది.
అలాగే చిన్న చితక పార్టీలు మాత్రం స్మార్ట్ ఫోన్లు.... ఐ పాడ్లు.... ల్యాప్ టాప్లు అందిస్తున్నాయి. దీంతో ఓటర్లు మాత్రం ఈ ఆఫర్లతో తడిసి ముద్దవుతున్నారు. ఓటర్ల కోసం ఇప్పటికే ఓ పెద్ద పార్టీ నాయకులు ఒక్కో రాడో వాచీ కోసం కనీసం రూ. 20 వేలు చెల్లించి... భారీ ఎత్తున కొనుగోలు చేశారని సాక్షాత్తూ... సదరు వాచీల పంపిణీదారుడే వెల్లడించడం కొసమెరుపు.
కర్ణాటక రాష్ట్రంలో 25 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 27వ తేదీన ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని దార్వాడ్, బాగల్కోట్, విజయపూరీ జిల్లాలో ఫోన్లు.... ఐ పాడ్లు.... ల్యాప్ టాప్లు నాయకులు ఓటర్లకు అందిస్తున్నారు. కోలార్ జిల్లాలో అయితే రాడో వాచీలు ఓటర్ల చేతిలో తిరుగుతున్నాయి.
అలాగే కోడుగు ప్రాంతంలో మాత్రం జానీ వాకర్ బ్లాక్ లేబుల్ స్కాచ్ విస్కీ బాటిళ్లు చేరుతున్నాయి. ఈ ఎన్నికల్లో 700 నుంచి 9500 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క ఓటరు చేతిలో ఐపాడ్... స్మార్ట్ ఫోన్...రాడో వాచీలు... స్కాచ్ విస్కీల బాటిల్ ఏదో ఒక్కటి చేరనుంది.