కొంప ముంచిన టీవీ ఇంటర్వ్యూలు | Sakshi
Sakshi News home page

కొంప ముంచిన టీవీ ఇంటర్వ్యూలు

Published Mon, Jan 4 2016 3:05 AM

కొంప ముంచిన టీవీ ఇంటర్వ్యూలు - Sakshi

 ఊడిన పదవి
 తన గోతిని తానే తవ్వుకున్న వైనం
 కొంపముంచిన టీవీ ఇంటర్వ్యూలు  

 
 సాక్షి, చెన్నై :అన్నాడీఎంకే సిద్ధాంతాల ప్ర చార ఉప కార్యదర్శి నాంజిల్ సంపత్‌కు ఆ పార్టీ అధినేత్రి జయలలిత షాక్ ఇచ్చారు. పదవి నుంచి ఉద్వాసన పలుకుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, టీవీ ఇంటర్వ్యూల రూపంలో తన గోతిని తానే నాంజిల్ తవ్వుకుని ఉండడం గమనార్హం. ‘నాంజిల్ సంపత్’  రాజకీయ అవగాహన కల్గిన పటిష్ట నేత, పరిస్థితులకు అనుకూలంగా అనర్గళంగా ప్రసంగించే వ్యాఖ్యాత. వైగో నేతృత్వంలోని ఎండీఎంకేకు వెన్నెముకగాఉన్న ఆయన ఇటీవలే అన్నాడీఎంకే గూటికి చేరారు. అన్నాడీఎంకేలోకి రాగానే, సీఎం, ఆ పార్టీ అధినేత్రి జయలలిత నాంజిల్‌కు మంచి గుర్తింపునే ఇచ్చారు.
 
  పార్టీ సిద్ధాం తాల ప్రచార ఉప కార్యదర్శి పదవిని అప్పగించారు. ఓ ఇన్నోవా కారును సైతం అందించి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార పర్యటన సాగించేందుకు అవకాశం ఇచ్చారు. నాంజిల్ లేనిదే అన్నాడీఎంకే బహిరంగ సభలు లేదన్నట్టుగా ఎదిగారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ప్రచారాలకు నాంజిల్ కీలకంగా మారారని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో నాంజిల్‌కు పెద్ద షాక్ ఇస్తూ జయలలిత నిర్ణయం తీసుకోవడం చర్చకు దారి తీసింది. పార్టీ నుంచి పొమ్మని పొగ పెట్టకున్నా, నాంజిల్ చేతిలో ఉన్న పదవిని మాత్రం  లాక్కోవడం గమనార్హం. ప్రచార ఉప కార్యదర్శి పదవిని నుంచి ఆయన్ను తొలగించడంతో సోషల్ మీడియాల్లో సెటైర్లు బయలు దేరాయి. పదవి ఊడింది...మిగిలింది ఇన్నోవానే, తన గోతిని తానే తవ్వుకున్న వ్యాఖ్యాత... అన్న చమత్కారాలు, వ్యంగ్యాస్త్రాలను నాంజిల్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
 టీవీ ఇంటర్వ్యూలు :
 తన అనుమతి లేనిదే ఎవరైనా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కన్నెర్ర చేయడం జయలలితకు అలవాటే. ఆ దిశగా ఇటీవల టీవీలో సర్కారుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ మాజీ డీజీపీ ఆర్ నటరాజ్‌కు ఉద్వాసన పలికారు. అయితే, ఆ ఫోన్ ఇంటర్వ్యూ ఇచ్చింది తాను కాదంటూ నటరాజ్ వివరణ ఇచ్చుకుని మళ్లీ చడి చప్పుడు కాకుండా పార్టీలోకి వచ్చారు. ఈ సమయంలో, పార్టీ సిద్ధాంతాల ప్రచార ఉప  కార్యదర్శిగా తనకు జయలలిత ఇచ్చిన అధికారాల్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో తన గోతిని తానే నాంజిల్ తవ్వుకున్నారని చెప్పవచ్చు. పార్టీ తరపున టీవీల్లో చర్చా కార్యక్రమాల్లో చురుగ్గానే నాంజిల్ రాణించారు.
 
 అదే సమయంలో శనివారం ఓ టీవీకి ఇచ్చిన  ఇంటర్వ్యూలో నాంజిల్ వ్యాఖ్యలు వ్యంగ్యాస్త్రాలకు, ప్రజల్లో ఆగ్రహానికి దారి తీశాయని చెప్పవచ్చు. ఆ ప్రశ్నల్లో కొన్ని..వరద బాధితుల్ని అమ్మ పరామర్శించ లేదే అన్న ప్రశ్నకు, అమ్మకు రాలేని పరిస్థితి అని సమాధానం ఇవ్వడంతో జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అనుమానాల్ని రెకెత్తించేలా చేశారు. వరదల వేళ అన్నాడీఎంకే సర్వ సభ్యంలో హంగులు అవసరామా.? అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చే క్రమంలో కాస్త దూకుడును నాంజిల్ ప్రదర్శించారు. ఓ గ్రామంలోని  ఓ ఇంట్లో విషాదం ఉంటే, మరో ఇంట్లో పెళ్లి జరగకూడదా, వరదల నుంచి ప్రజలు ఎప్పుడో కోలుకున్నారని, కొందరు మాత్రమే కోలుకావాల్సి ఉందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం జయలలితలో ఆగ్రహాన్ని రేపాయి. అన్నాడీఎంకే సర్కారు అప్పుల ఊబిలో ఉన్నట్టుందే..? అన్న ప్రశ్నకు, అప్పులు తీసుకోవడం సహజమే, దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని కొట్టి పారేశారు. అన్నాడీఎంకేకు ఎదురుగా ఇది వరకు ప్రతి పక్షం లేదని, ఇప్పుడు ప్రతి పక్షం అన్నది బలంగానే  అవతరించి ఉన్నదంటూ పరోక్షంగా డీఎంకే బలం పెరిగినట్టు స్పందించారు.
 
  ఇక, ఇన్నోవా ఇచ్చారు సరే, తనకు ఇళ్లు ఎక్కడ..?  వరద బాధిత గుడిసె వాసులకు ఇస్తున్నట్టుగానే, తనకు ఇవ్వొచ్చుగా..! అని వ్యాఖ్యలు చేసిన తాను తవ్వుకున్న గోతిలోనే నాంజిల్ పడి ఉండటం గమనించాల్సిన విషయం. అలాగే, మరో టీవీ ఛానల్‌కు తమకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఆధారంగా  పదే పదే నాంజిల్ స్పందించిన  కొన్ని అంశాలను ఎత్తి చూపుతూ ప్రత్యేకంగా ప్రొమో ఇస్తూ, చూస్తూ ఉండండి..చూస్తూ ఉండండి అని పబ్లిసిటీ ఇవ్వడం జయలలితకు మరింత ఆగ్రహాన్ని తెప్పించి, పార్టీ నుంచి సాగనంప కుండా , పదవి నుంచి తొలగించి పొమ్మని చెప్పకనే పొగ పెట్టినట్టుగా వ్యవహరించి ఉండడం గమనార్హం. అయితే, తదుపరి నాంజిల్ అడుగులు ఎలా ఉంటాయో అన్న ఎదురు చూపుల్లో ఆయన మద్దతు దారులు ఉన్నారు. ఇక, ద్రవిడ సిద్ధాంతాలను అనుసరించే  నాంజిల్‌కు దిక్కు డీఎంకే మాత్రమే.
 

Advertisement
 
Advertisement