నేడు లెక్కింపు | counting of votes in relation to the Gram Panchayat elections | Sakshi
Sakshi News home page

నేడు లెక్కింపు

Jun 5 2015 5:35 AM | Updated on Sep 3 2017 3:16 AM

రాష్ట్ర వ్యాప్తంగా రెండు విడతలుగా జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 5,735 గ్రామ పంచాయతీల్లో 84,854 స్థానాలకు అభ్యర్థులు పోటీపడ్డారు...

- అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ
- గెలుపోటములపై గ్రామాల్లో జోరుగా బెట్టింగ్
- అవాంఛనీయ
- సంఘటనలు జరగకుండా హోం శాఖ చర్యలు

రెండు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు నేడు(శుక్రవారం) జరగనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దాయాదుల సమరం, అత్తాకోడళ్ల పోటీ కి గ్రామ పంచాయతీ ఎన్నికలు వేదికగా నిలిచిన విషయం తెలిసిందే.
     
సాక్షి, బెంగళూరు : రాష్ట్ర వ్యాప్తంగా రెండు విడతలుగా జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 5,735 గ్రామ పంచాయతీల్లో 84,854 స్థానాలకు అభ్యర్థులు పోటీపడ్డారు. మొదటి విడతలో 82. 54శాతం ఓటింగ్ నమోదు కాగా, రెండో విడతలో 80. 38శాతం ఓటింగ్ నమోదైంది. శుక్రవారం ఉదయం 8గంటలకు ఆయా తాలూకాల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండగా, సాయంత్రం 5గంటలకు  ఫలి తాలను వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈవీఎంలు కాకుం డా బ్యాలెట్ పత్రాలను ఉపయోగించడంతో కౌంటింగ్ ప్రక్రియ అనుకున్న సమయం కన్నా కాస్తంత ఆలస్యం అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇదే సందర్భంలో గెలుపు, ఓటములపై గ్రామాల్లో జోరుగా బెట్టింగ్ సైతం సాగుతోంది. కొన్ని గ్రామాల్లో బెట్టింగ్ వేలు, లక్షలు సైతం దాటి కోట్ల రూపాయల్లోకి చేరడం గమనార్హం. ఇక పార్టీ గుర్తులపై ఈ ఎన్నికలు జరగక పోయినప్పటికీ, అన్ని ప్రముఖ రాజకీయ పార్టీలు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల కంటే ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను భావిస్తున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఆయా పార్టీల భవితవ్యాన్ని నిర్దేశించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయనే వార్తల మధ్య ప్రముఖ పార్టీల నేతల్లో సైతం గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర కుతూహలం నెలకొందనే చెప్పవచ్చు.

కట్టుదిట్టమైన భద్రత
కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా హోం శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టంది. దాదాపు 22వేల మంది పోలీసులు భద్రతను పర్యవేక్షించనున్నారు. ఇదే సందర్భంలో ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు విజయోత్సవాలు నిర్వహించే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చో టుచేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు హోం శాఖ ఉన్నత అధికారులు వెల్లడించారు. అంతేకాక సమస్యాత్మకంగా గుర్తించిన ప్రాంతాల్లో విజయోత్సవాలకు అనుమతి సైతం ఇవ్వలేదని అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement