సెయింట్ జార్ట్ కోటలోని అసెంబ్లీ ఆవరణలో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం ప్రారంభం కానున్నది. స్పీకర్ ధనపాల్ నేతృత్వంలో జరగనున్న తొలిరోజు
సమరానికి సై
Jan 30 2014 12:38 AM | Updated on Sep 2 2017 3:09 AM
సాక్షి, చెన్నై:సెయింట్ జార్ట్ కోటలోని అసెంబ్లీ ఆవరణలో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం ప్రారంభం కానున్నది. స్పీకర్ ధనపాల్ నేతృత్వంలో జరగనున్న తొలిరోజు సమావేశంలో రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య ప్రసంగించనున్నారు. ఇందులో ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ సరికొత్త పథకాల్ని ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న సమావేశం కావడంతో రాష్ర్ట గవర్నర్ ద్వారా సరికొత్త అంశాల్ని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రభుత్వం ప్రకటించబోతున్నది. ఈ సమావేశం అనంతరం స్పీకర్ నేతృత్వంలో అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. చర్చించాల్సిన అంశాలతో పాటుగా ఎన్ని రోజులు సభ నిర్వహిం చాలో ఇందులో నిర్ణయం తీసుకోనున్నారు. తొలుత గవర్నర్ ప్రసంగానికి కృతజ్ఞతలు, అందులోని అంశాలపై చర్చ జరగనున్నది. వారం రోజుల పాటుగా సభ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. అసెంబ్లీ ఆవరణను సుందరంగా తీర్చిదిద్దడంతోపాటుగా పరిసరాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఢీకి రెడీ: కొత్త సంవత్సరంలో జరగనున్న తొలి సమరంలో ప్రభుత్వంతో ఢీ కొట్టేందుకు ప్రతి పక్షాలూ సిద్ధం అయ్యాయి. వీరి చర్యల్ని తిప్పి కొట్టేందుకు అధికార పక్షం సైతం సన్నద్ధంగా ఉంది. ఇప్పటికే అన్ని విభాగాల అధికారులు, మంత్రులతో సీఎం సమీక్షలు ముగించారు. తమ తమ విభాగాలపై మంత్రులూ పూర్తి అవగాహనతో ఉన్నారు. శాంతి భద్రతల్ని, జాలర్ల చర్చల్లో తీసుకున్న నిర్ణయాలతో పాటుగా మరికొన్ని ప్రజా సమస్యల్ని, ఎంజీయార్ విగ్రహ తొలగింపు వ్యవహారాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుని అధికార పక్షంతో ప్రతి పక్షాలు ఢీ కొట్టే అవకాశాలు ఉన్నాయి.
Advertisement


