ఆమ్నెస్టీని నిషేధించాలి | Amnesty prohibit | Sakshi
Sakshi News home page

ఆమ్నెస్టీని నిషేధించాలి

Aug 21 2016 2:52 AM | Updated on Sep 4 2017 10:06 AM

కర్ణాటకలో శాంతిభద్రతల సమస్యకు కారణమైన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని

బెంగళూరులో బీజేపీ భారీ నిరసన
కేంద్రానికి  డిప్యూటీ మాజీ  సీఎం  ఆర్.అశోక్ లేఖ
ఉన్నతస్థాయి  దర్యాప్తు చేపట్టాలి

 

బెంగళూరు :  కర్ణాటకలో శాంతిభద్రతల సమస్యకు కారణమైన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని నిషేధించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని పేర్కొం టూ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాసినట్లు మాజీ ఉపముఖ్యమంత్రి ఆర్.అశోక్ తెలిపారు. భారత సైనికులకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించిన వారిని అరెస్టు చేయాలని, అమ్నెస్టీ సంస్థను నిషేధించాలని పేర్కొంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం నిరసనకారులపై జరిగిన లాఠీచార్జ్‌ను నిరసిస్తూ రాష్ట్ర బీజేపీ మహిళామోర్చ విభాగం న గరంలోని ఆనంద్‌రావ్ సర్కిల్ వద్ద శనివారం నిరసనకు దిగింది.

ఇందులో ఆ పార్టీ ముఖ్యనేతలైన ఆర్.అశోక్, పీ.సీ మోహన్, సురేష్‌కుమార్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తప్పు చేసిన వారిని వదిలి ఆ తప్పును ప్రశ్నించిన వారిపై అధికార కాంగ్రెస్ పార్టీ కక్షకట్టిందన్నారు. అందువల్లే భారత సైనికులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వారితో పాటు అందుకు కారణమైన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌పై దేశద్రోహం కేసు నమోదైనా ఇప్పటి వరకు సదరు కేసులో ఎవరిని అరెస్ట్ కూడా చేయలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాలన్నింటినీ వివరిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాసామని పేర్కొన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ లేదా ఏదేని స్వతంత్ర సంస్థతో  ఈ విషయంపై విచారణ జరిపించి ఘటనకు కారణమైన వారిని చట్టం ప్రకాశం శిక్షించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఏబీవీపీ నిర్వహిస్తున్న నిరసనకు మద్దతు తెలిపిన ప్రముఖ న్యాయవాది ప్రమీళనై సర్గి తదితరులు మాట్లాడారు. ఇదిలా ఉంటే ఏబీవీపీ నిరసనల నేపథ్యంలో బెంగళూరులోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.
 
ఆమ్నెస్టీ తప్పేమీ లేదు !
ఘటన సంబంధించి రాష్ట్ర హోంశాఖ మంత్రి పరమేశ్వర్ శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తప్పు ఏమీ చేయలేదు. కాశ్మీర్ బాధితులకు సాంత్వన చెప్పడంతో పాటు సహాయం అందించడానికి మాత్రమే నగరంలో కార్యక్రమం నిర్వహించింది. ఈ విషయాన్ని ఏబీవీపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తూ ఆ సంస్థ దేశద్రోహానికి పాల్పడిందని పేర్కొంటున్నారు. ఇది చాలా తప్పు.’ అని పేర్కొన్నారు. ఇక ఎల్లప్పుడూ విదేశాల్లో ఉండే ప్రధాని నరేంద్రమోదీ దేశంలో అంతర్భాగమైన రాష్ట్రాల్లోని సమస్యల పరిష్కారం పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement