రాజ్‌నాథ్‌ @ అమర్‌నాథ్‌

Union minister Rajnath Singh visits Amarnath Temple - Sakshi

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ పర్యటనలో భాగంగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రెండో రోజు శనివారం ప్రఖ్యాత అమర్‌నాథ్‌ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. పవిత్ర గుహలో మంచు శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బివిన్‌ రావత్, సైనిక దళాల ప్రధానాధికారి జనరల్‌ ఎం.ఎం.నరవణే తదితరులు ఉన్నారు. వారంతా దాదాపు గంట పాటు అమర్‌నాథ్‌ ఆలయ ప్రాంగణంలో గడిపారు. అమర్‌నాథుడిని ప్రార్థించడం గొప్ప అనుభూతి కలిగించిందంటూ రాజ్‌నాథ్‌సింగ్‌ ట్వీట్‌ చేశారు.  

నార్త్‌ హిల్‌ పోస్టును సందర్శించిన రాజ్‌నాథ్‌  
జమ్మూకశ్మీర్‌ రాష్ట్రం కుప్వారా జిల్లా కెరాన్‌ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంట ఉన్న కీలకమైన నార్త్‌ హిల్‌ సైనిక పోస్టును రాజ్‌నాథ్‌సింగ్‌ శనివారం సందర్శించారు. అక్కడి ప్రస్తుత పరిస్థితిని సైనికాధికారులు రాజ్‌నాథ్‌కు వివరించారు. నార్త్‌ హిల్‌ పోస్టులో విధుల్లో ఉన్న జవాన్లతో మాట్లాడానని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. వారు అసమాన ధైర్య సాహసాలతో మన దేశాన్ని ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుతున్నారని ప్రశంసించారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top