
యువరాజ్ది మార్కెట్ ఆధారిత రేటు
ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో రూ.16 కోట్ల అత్యధిక ధరతో యువరాజ్ సింగ్ను కొనుగోలు చేసిన ఢిల్లీ డేర్డెవిల్స్కు ఈ ఏడాది ఇప్పటివరకు అతడి ద్వారా పెద్దగా ఒరిగిందేం లేదు.
ఢిల్లీ డేర్డెవిల్స్ సీఈవో హేమంత్ దువా
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో రూ.16 కోట్ల అత్యధిక ధరతో యువరాజ్ సింగ్ను కొనుగోలు చేసిన ఢిల్లీ డేర్డెవిల్స్కు ఈ ఏడాది ఇప్పటివరకు అతడి ద్వారా పెద్దగా ఒరిగిందేం లేదు. అయితే ఏమాత్రం రాణించలేకపోతున్న యువీపై అంత ధర పెట్టడంపై డీడీ స్పందించింది. అది ఐపీఎల్ మార్కెట్ను అనుసరించే జరిగిందని ఆ జట్టు సీఈవో హేమంత్ దువా అన్నారు. వేలం సమయంలో యువరాజ్కు ఉన్న డిమాండ్ అలాంటిదని, ఈ విషయంలో తమకు ఎలాంటి బాధా లేదన్నారు. ‘యువీకి సంబంధించిన రేటుపై అందరూ మాట్లాడుతున్నారు.
అయితే ఈ ధరంతా అప్పటి అతడి మార్కెట్కు సంబంధించింది. అంత రేటును తానేమీ అడగనని యువరాజ్ గతంలోనే చెప్పాడు. నిజానికి తక్కువ రేటుకే మేం అతడిని కొనుగోలు చేయాలని భావించాం. కానీ వేలం ప్రారంభమయ్యాక మరో ఫ్రాంచైజీ కూడా పోటీ పడడంతో రేటు ఎక్కడికో వెళ్లింది. అందుకే తనది మార్కెట్ రేటు అని చెప్పాను. త్వరలోనే అతడు తన ఫామ్ను చాటుకుంటాడు’ అని దువా ఆశాభావం వ్యక్తం చేశారు.