రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ద్విశతకాలు చేసిన క్రికెటర్‌ | Sri Lankan batsman Angelo Perera hits 2 double hundreds in a single match | Sakshi
Sakshi News home page

రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ద్విశతకాలు చేసిన క్రికెటర్‌

Feb 4 2019 3:45 PM | Updated on Feb 4 2019 3:46 PM

Sri Lankan batsman Angelo Perera hits 2 double hundreds in a single match - Sakshi

కొలంబో: శ్రీలంక క్రికెటర్‌ ఏంజెలో పెరీరా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒకే మ్యాచ్‌లో రెండు డబుల్‌ సెంచరీలు సాధించిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. శ్రీలంక దేశవాళీ క్రికెట్‌లో భాగంగా నాండేస్రిప్ట్స్‌కు సారథిగా వ్యవహరిస్తున్న పెరీరా.. అద్భుతమైన బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 201 పరుగులు చేసిన పెరీరా.. రెండో ఇన‍్నింగ్స్‌లో 231 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించాడు.

తొలి ఇన్నింగ్స్‌లో 203 బంతులను ఎదుర్కొని 20 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో డబుల్‌ సెంచరీ సాధించాడు. ఇక్కడ అతని స్ట్రైక్‌రేట్‌ దాదాపు వంద ఉండటం విశేషం. ఆపై రెండో ఇన్నింగ్స్‌లో 268 బంతుల్లో 20 ఫోర్లు, 3 సిక్సర్లతో 231 పరుగుల్ని నమోదు చేశాడు. ఫలితంగా ఒకే మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ద్విశతకాలు సాధించిన రెండో క్రికెటర్‌గా పెరీరా గుర్తింపు సాధించాడు. అంతకుముందు 1938లో ఇంగ్లిష్‌ క్రికెటర్‌ ఆర్థర్‌ ఫాగ్‌ ఒకే మ్యాచ్‌లో రెండు ద్విశతకాలు సాధించాడు. ఆ తర్వాత ఇంతకాలానికి ఆ ఫీట్‌ను పెరీరా అందుకున్నాడు.

2013లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేసిన పెరీరా.. ఇప్పటివరకూ కేవలం నాలుగు వన్డేలు, రెండు టీ20లు మాత్రమే ఆడాడు. అతను చివరగా ఆస్ట్రేలియాతో 2016లో జరిగిన సిరీస్‌లో లంక తరఫున కనిపించాడు. ఇక ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో 97 మ్యాచ్‌లు ఆడిన పెరీరా 18 సెంచరీలు, 33 హాఫ్‌ సెంచరీలతో 6,941 పరుగులు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement