క్వార్టర్స్‌లో సిరిల్‌ వర్మ, రోహిత్‌ యాదవ్‌

Siril Varma in Quarters of Badminton Tourney - Sakshi

ఆలిండియా సీనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ  

సాక్షి, హైదరాబాద్‌: ఆలిండియా సీనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ క్రీడాకారులు సిరిల్‌ వర్మ, చిట్టబోయిన రోహిత్‌ యాదవ్‌ నిలకడగా రాణిస్తున్నారు. విజయవాడలో జరుగుతోన్న ఈ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో వీరిద్దరూ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నారు. నగరానికే చెందిన మరో ప్లేయర్‌ రాహుల్‌ యాదవ్‌ ప్రిక్వార్టర్‌లో ఓడిపోయాడు. రాహుల్‌ 18–21, 21–17, 10–21తో రోహన్‌ చేతిలో ఓడిపోయాడు. శుక్రవారం ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్‌ సిరిల్‌ వర్మ (తెలంగాణ) 21–15, 19–21, 21–11తో క్వాలిఫయర్‌ ప్రియాన్షు రజావత్‌పై గెలుపొందాడు. అంతకుముందు రెండో రౌండ్‌లో సిరిల్‌ వర్మ 21–7, 21–13తో క్వాలిఫయర్‌ హిమాన్షు తివారీ (ఉత్తరాఖండ్‌)పై, తొలిరౌండ్‌లో 21–11, 21–17తో అమన్‌ ఫరోగ్‌ (మహారాష్ట్ర)పై గెలుపొందాడు. టాప్‌ సీడ్‌ రోహిత్‌ యాదవ్‌ ప్రిక్వార్టర్స్‌లో 24–22, 11–21, 21–17తో ఎం. రఘు (కర్ణాటక)పై, రెండో రౌండ్‌లో 21–19, 21–12తో అనంత్‌ శివమ్‌ జిందాల్‌ (హరియాణా)పై, తొలిరౌండ్‌లో 21–16, 21–16తో నవీన్‌ (క్వాలిఫయర్‌)పై నెగ్గి ముందంజ వేశాడు. మరోవైపు పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో రెండో సీడ్‌ రాహుల్‌ యాదవ్‌ (తెలంగాణ) 18–21, 21–17, 10–21తో క్వాలిఫయర్‌ రోహన్‌ గుర్బానీ (మహారాష్ట్ర) చేతిలో ఓడిపోయాడు. మహిళల విభాగంలో ప్రీతి (ఆంధ్రప్రదేశ్‌) క్వార్టర్స్‌కు చేరుకోగా... నిషితా వర్మ, జి. వృశాలి,  (ఆంధ్రప్రదేశ్‌) ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగారు.

మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో ప్రీతి 21–17, 7–21, 21–10తో త్రిషా హెగ్డే (కర్ణాటక)పై విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో నిషితా వర్మ 16–21, 8–21తో ఉన్నతి బిష్త్‌ (ఉత్తరాఖండ్‌) చేతిలో, వృశాలి 21–15, 18–21, 11–21తో వైదేహి చౌదరీ (మహారాష్ట్ర) చేతిలో ఓటమి పరాజయం పాలయ్యారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో తెలంగాణ క్రీడాకారుడు శ్రీకృష్ణ సాయికుమార్‌ తన జోడీ కావ్య గాంధీతో కలిసి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. ప్రిక్వార్టర్స్‌లో శ్రీకృష్ణ–కావ్య (ఢిల్లీ) ద్వయం 16–21, 21–18, 21–19తో కబీర్‌ (రైల్వేస్‌)–సోనిక సాయి (ఆంధ్రప్రదేశ్‌) జంటపై గెలుపొందింది. మరో పోరులో ఐదో సీడ్‌ గౌస్‌ షేక్‌ (ఆంధ్రప్రదేశ్‌)–మయూరి (గుజరాత్‌) జంట 21–16, 23–21తో సాంగ్రమ్‌ చుటియా–మనాలి బోరా (అస్సాం) జోడీపై గెలుపొంది ముందంజ వేసింది.

పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో టాప్‌ సీడ్‌ కృష్ణ ప్రసాద్‌ (ఆంధ్రప్రదేశ్‌)– ధ్రువ్‌ కపిల (ఎయిరిండియా) జంట 21–7, 21–16తో ప్రతీక్‌ రనడే– అక్షయ్‌ రౌత్‌ (మహారాష్ట్ర) జోడీపై గెలుపొంది క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. మరో మ్యాచ్‌లో సంజయ్‌ శ్రీవత్స (పాండిచ్చేరి)–సిద్ధార్థ్‌ (తెలంగాణ) జంట 21–16, 13–21, 21–15తో ఆరోసీడ్‌ ప్రకాశ్‌ రాజ్‌–వైభవ్‌ (కర్ణాటక) జోడీకి షాకిచ్చింది. మహిళల డబుల్స్‌ క్వార్టర్స్‌లో సాహితి (తెలంగాణ)–ధ్రితి(కర్ణాటక) ద్వయం 23–21, 21–12తో రమ్య(తమిళనాడు)–మయూరి యాదవ్‌ (గుజరాత్‌) జోడీపై నెగ్గి క్వార్టర్స్‌కు చేరుకుంది.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top