డబ్బులపై అసంతృప్తితోనే... | Shikhar Dhawan left Sunrisers Hyderabad to join Delhi | Sakshi
Sakshi News home page

డబ్బులపై అసంతృప్తితోనే...

Nov 6 2018 2:08 AM | Updated on Nov 6 2018 2:09 AM

Shikhar Dhawan left Sunrisers Hyderabad to join Delhi - Sakshi

హైదరాబాద్‌: భారత ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌కు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుతో ఉన్న అనుబంధం ముగిసింది. ధావన్‌ తమ ఫ్రాంచైజీని వీడినట్లు సన్‌రైజర్స్‌ యాజమాన్యం సోమవారం అధికారికంగా ప్రకటించింది. అయితే సాధారణంగా పరస్పర కృతజ్ఞతలతో జరిగే ఇలాంటి మార్పుపై ‘సన్‌’ చేసిన బహిరంగ ప్రకటన ఆశ్చర్యం కలిగించింది. ధావన్‌ తాము ఇస్తున్న డబ్బులపై అసంతృప్తి కారణంగానే వెళ్లిపోయాడని సన్‌రైజర్స్‌ మేనేజ్‌మెంట్‌ కుండబద్దలు కొట్టింది. 2018 ఐపీఎల్‌లో ధావన్‌ను కొనసాగించేందుకు ఇష్టపడని హైదరాబాద్‌ టీమ్‌ అతడిని వేలానికి  ముందు విడుదల చేసింది.

మళ్లీ వేలంలో ‘రైట్‌ టు మ్యాచ్‌ కార్డ్‌’తో రూ. 5.2 కోట్లకే తిరిగి సొంతం చేసుకుంది. 2017లో ధావన్‌కు ఇచ్చిన రూ. 12.5 కోట్లతో పోలిస్తే ఈ మొత్తం చాలా తక్కువ కావడం గమనార్హం! ఈ అసంతృప్తి ధావన్‌లో ఉండిపోయింది. ‘రైట్‌ టు మ్యాచ్‌ కార్డు ద్వారా ఈ ఏడాది ధావన్‌ను తిరిగి సొంతం చేసుకున్నాం. దురదృష్టవశాత్తూ అతనికి ఇస్తున్న మొత్తంపై సంతృప్తిగా లేడని మాకు కనిపిస్తూనే ఉంది. కానీ ఐపీఎల్‌ నిబంధనల ప్రకారం మేం అందులో మార్పులు చేయడానికి వీలులేదు.

ధావన్‌ సన్‌రైజర్స్‌కు చేసిన సేవలను మేం గుర్తిస్తున్నాం. అయితే ఆర్థికపరమైన కారణాలతో అతను జట్టును వీడాలని నిర్ణయించుకోవడం బాధాకరం’ అని సన్‌రైజర్స్‌ తమ ప్రకటనలో పేర్కొంది. ధావన్‌          తమ జట్టులోకి రావడాన్ని ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ డైరెక్టర్‌ పార్థ్‌ జిందాల్‌ స్వాగతించగా... అతనికి బదులుగా సన్‌రైజర్స్‌ ముగ్గురు ఆటగాళ్లు విజయ్‌ శంకర్, షాబాజ్‌ నదీమ్, అభిషేక్‌ శర్మలను తీసుకుంది. 2013 నుంచి ఆరు సీజన్ల పాటు సన్‌రైజర్స్‌కు      ఆడిన ధావన్‌ 85 మ్యాచ్‌లలో 124.28 స్ట్రయిక్‌ రేట్‌తో 2,518 పరుగులు చేశాడు. ఇందులో 19 అర్ధ సెంచరీలు ఉన్నాయి.    

Advertisement
 
Advertisement
Advertisement