క్రికెట్లో నిషేధం.. ఫుట్బాల్ ప్లేయర్గా అవతారం
ఢాకా: ఇటీవల బంగ్లాదేశ్ రెగ్యులర్ కెప్టెన్ షకిబుల్ హసన్పై రెండేళ్లు నిషేధం విధిస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిషేధం తీసుకున్న సంగతి తెలిసిందే. తనను ఒక బుకీ సంప్రదించినా ఆ విషయాన్ని దాచి పెట్టడంతో షకిబుల్పై 24 నెలలు నిషేధం విధించింది ఐసీసీ. ఏ క్రికెటరైనా రెండేళ్లు క్రికెట్ నుంచి నిషేధానికి గురైతే తన భవిష్యత్తు ప్రణాళికపై ఆలోచనలో పడటం ఖాయం. ఇప్పుడు అదే ఆలోచనలో ఉన్నట్లు కనబడుతున్నాడు షకిబుల్. క్రికెట్ నుంచి సస్పెండ్ అయితే ఏంటి.. తన ప్లాన్ తనకుందని చెప్పకనే చెప్పాడు. తాజాగా ఫుట్బాల్ ప్లేయర్ అవతారం ఎత్తాడు ఈ స్టార్ ఆల్ రౌండర్.
బంగ్లాదేశ్ ఆర్మీ స్టేడియంలో కొరియన్ ఎక్స్పాట్ జట్టుతో జరిగిన ఫుట్బాల్ మ్యాచ్లో ఫూటీ హ్యాగ్స్కు ప్రాతినిథ్యం వహించాడు. ఆ మ్యాచ్లో ఫూటీ హ్యాగ్స్ 3-2 తేడాతో కొరియన్ ఎక్స్పాట్పై గెలిచింది. వన్డే వరల్డ్కప్లో బంగ్లాదేశ్ తరఫున రాణించిన క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే అది షకిబులే. అయితే నిషేధం కారణంగా వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరుగనున్న టీ20 వరల్డ్కప్కు షకిబుల్ దూరం కావాల్సి వస్తుంది. ప్రస్తుతం భారత్లో ఉన్న బంగ్లాదేశ్ జట్టు షకిబుల్ లేకుండానే బరిలోకి దిగింది. టీ20 సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో గెలిచిన బంగ్లా.. రెండో టీ20 టీమిండియా చేతిలో ఘోర పరాజయం చవిచూసింది. దాంతో సిరీస్ 1-1తో సమం అయ్యింది. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ ఆదివారం జరుగనుంది. రేపటి మ్యాచ్లో భారత్ గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని భావిసక్తుండా, బంగ్లాదేశ్ కూడా అదే యోచనలో ఉంది. దాంతో ఇరు జట్ల మధ్య ఆసక్తికర సమరం ఖాయంగా కనబడుతోంది.