సమీర్‌ నిష్క్రమణ  | Sameer Verma loses to Chinese Shi Yuqi | Sakshi
Sakshi News home page

సమీర్‌ నిష్క్రమణ 

Apr 3 2019 3:22 AM | Updated on Apr 3 2019 3:22 AM

Sameer Verma loses to Chinese Shi Yuqi - Sakshi

కౌలాలంపూర్‌: మలేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత షట్లర్‌ సమీర్‌ వర్మ పోరాటం తొలిరౌండ్లోనే ముగిసింది. మంగళవారం పురుషుల సింగిల్స్‌ మొదటి రౌండ్లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ షి యుకి (చైనా)తో తలపడిన సమీర్‌ పోరాడి ఓడాడు. మూడు గేమ్‌ల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అతను 20–22, 23–21, 12–21తో చైనా ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలయ్యాడు. 65 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో పరాజయం ఎదురైనప్పటికీ 24 ఏళ్ల సమీర్‌ అద్భుతంగా పోరాడాడు. తెలుగమ్మాయి, డబుల్స్‌ క్రీడాకారిణి సిక్కిరెడ్డికి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి.

మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలిరౌండ్లో సిక్కిరెడ్డి–ప్రణవ్‌ చోప్రా జోడీ 22–20, 24–22తో సామ్‌ మ్యాగీ–క్లో మ్యాగీ (ఐర్లాండ్‌) జంటపై గెలిచింది. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్పతో జతకట్టిన ఆమె 20–22, 21–17, 20–22తో బయెక్‌ హ న–కిమ్‌ హె రిన్‌ (కొరియా) జంట చేతిలో ఓడింది. నేడు జరిగే మహిళల సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్‌ పీవీ సింధు... జపాన్‌కు చెందిన అయ ఒహొరితో, ఎనిమిదో సీడ్‌ సైనా నెహ్వాల్‌... థాయ్‌లాండ్‌ షట్లర్‌ పొర్న్‌పవి చొచువొంగ్‌తో తలపడతారు. పురుషుల సింగిల్స్‌ తొలిరౌండ్లో ఎనిమిదో సీడ్‌ కిడాంబి శ్రీకాంత్‌... ఇసాన్‌ మౌలాన ముస్తఫా (ఇండోనేసియా)తో, హెచ్‌.ఎస్‌. ప్రణయ్‌... సితికొమ్‌ తమసిన్‌ (థాయ్‌లాండ్‌)తో పోటీపడతారు.

Advertisement
 
Advertisement
Advertisement