సూపర్ సింధు

సూపర్ సింధు


* మలేసియా మాస్టర్స్ టైటిల్ సొంతం  

* ఫైనల్లో కిర్‌స్టీ గిల్మౌర్‌పై విజయం  

* కెరీర్‌లో ఐదో గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్




గతేడాది గాయాల కారణంగా అనుకున్న స్థాయిలో రాణించలేకపోయిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు కొత్త ఏడాదిలో శుభారంభం చేసింది. పూర్తి ఫిట్‌నెస్‌ను సంతరించుకున్న ఈ హైదరాబాద్ అమ్మాయి కొత్త సీజన్‌ను టైటిల్‌తో ప్రారంభించింది. స్వదేశంలో జరిగిన ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో అజేయంగా నిలిచిన ఈ తెలుగు అమ్మాయి అదే జోరును మలేసియా ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లోనూ కొనసాగించి చాంపియన్‌గా నిలిచింది.

 

పెనాంగ్: నిలకడగా రాణిస్తే అంచనాలకు అనుగుణమైన ఫలితాన్ని సాధించడం కష్టమేమీ కాదని భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరోసారి నిరూపించింది. సీజన్ ప్రారంభానికి ముందే పూర్తి ఫిట్‌నెస్ సంపాదించిన ఈ తెలుగు అమ్మాయి ఈ ఏడాది బరిలోకి దిగిన తొలి టోర్నమెంట్‌లోనే విజేతగా అవతరించింది. ఆదివారం ముగిసిన మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో సింధు చాంపియన్‌గా నిలిచింది. ఏకపక్షంగా జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ సింధు 21-15, 21-9తో ప్రపంచ 20వ ర్యాంకర్ కిర్‌స్టీ గిల్మౌర్ (స్కాట్లాండ్)పై గెలిచింది. తద్వారా 2013లో ఫ్రెంచ్ ఓపెన్‌లో కిర్‌స్టీ గిల్మౌర్ చేతిలో ఎదురైన ఏకైక పరాజయానికి బదులు తీర్చుకుంది.

 

విజేతగా నిలిచిన సింధుకు 9000 డాలర్ల (రూ. 6 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఎనిమిదేళ్ల చరిత్ర కలిగిన మలేసియా మాస్టర్స్ టోర్నీలో మహిళల సింగిల్స్ టైటిల్‌ను రెండుసార్లు నెగ్గిన తొలి ప్లేయర్‌గా సింధు గుర్తింపు పొందింది. 2013లో సింధు మలేసియా మాస్టర్స్ టైటిల్‌ను తొలిసారి సాధించి సీనియర్ స్థాయిలోనూ గొప్ప విజయాలు సాధించే సత్తా తనలో ఉందని చాటిచెప్పింది.

 

సెమీఫైనల్లో టాప్ సీడ్ సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)పై సంచలన విజయం సాధించిన సింధు... ఫైనల్లోనూ ఆద్యంతం నిలకడగా ఆడింది. గతంలో గిల్మౌర్ చేతిలో ఓడిన అనుభవమున్న సింధు ఈసారి ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకుండా ఆరంభం నుంచే జాగ్రత్తగా ఆడింది. అవకాశం దొరికినపుడల్లా పదునైన స్మాష్ షాట్‌లతో పాయింట్లు సాధించింది. ఈ క్రమంలో తొలుత 5-2తో.. ఆ తర్వాత 12-6తో... 18-10తో సింధు ఆధిక్యంలోకి వెళ్లి అదే జోరులో తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ సింధు ఆటతీరుకు గిల్మౌర్ వద్ద సమాధానం లేకపోయింది.



మొదట్లో సింధు 9-6తో ఆధిక్యంలోకి వెళ్లి ఆ తర్వాత వరుసగా 7 పాయింట్లు నెగ్గి 16-6తో ముం దంజ వేసింది. గిల్మౌర్‌కు ఏదశలోనూ పుంజుకునే అవకాశం ఇవ్వకుండా ఆడిన సింధు తుదకు 32 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించి తన ఖాతాలో టైటిల్‌ను జమచేసుకుంది. ఈ టోర్నీలో మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడిన సింధు  మూడు గంటల 46 నిమిషాలపాటు కోర్టులో గడిపింది. తన ప్రత్యర్థులకు కేవలం రెండు గేమ్‌లు మాత్రమే కోల్పోయింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో లీ చోంగ్ వీ 21-18, 21-11తో జైనుద్దీన్‌పై గెలిచి టైటిల్ నెగ్గాడు.

 

సింధుకు జగన్ అభినందనలు


సాక్షి, హైదరాబాద్: మలేసియా ఓపెన్ టైటిల్‌ను గెల్చుకున్న పి.వి.సింధుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో జరగబోయే క్రీడా పోటీలన్నింటిలోనూ ఆమె విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

 

‘బాయ్’ నజరానా రూ. 5 లక్షలు

మలేసియా ఓపెన్ టైటిల్ విజేత పీవీ సింధుకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) రూ. 5 లక్షల నగదు పురస్కారాన్ని ప్రకటించింది. ఇదే విధంగా రాణిస్తూ మున్ముందు ఆమె మరిన్ని టైటిల్స్ గెలవాలని ‘బాయ్’ అధ్యక్షుడు అఖిలేశ్ దాస్‌గుప్తా ఆకాంక్షించారు.

 

ఇదో గొప్ప విజయం. కొత్త సీజన్‌లో శుభారంభం లభించింది. ఫైనల్‌తో పోలిస్తే శనివారం టాప్ సీడ్ సుంగ్ జీ హున్‌తో జరిగిన సెమీఫైనల్లో కష్టపడి గెలిచాను. ఫైనల్లో ఆరంభంలోనే ఆధిక్యంలోకి వెళ్లి దానిని నిలబెట్టుకున్నాను. గతంలో గిల్మౌర్ చేతిలో ఓడినా... అప్పటికి ఇప్పటికీ నా ఆటతీరులో చాలా మార్పు వచ్చింది. ఈనెల 26న లక్నోలో మొదలయ్యే సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో పాల్గొంటున్నాను. ఆ తర్వాత హైదరాబాద్‌లో జరిగే ఆసియా టీమ్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగుతాను.    

-‘సాక్షి’తో సింధు

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top