క్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్‌ | PV Sindhu, Kidambi Srikanth enter China Open quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్‌

Sep 21 2018 1:21 AM | Updated on Sep 21 2018 1:21 AM

 PV Sindhu, Kidambi Srikanth enter China Open quarters - Sakshi

చాంగ్జౌ (చైనా): స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌ చైనా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 టోర్నమెంట్‌లో క్వార్టర్‌ ఫైనల్‌కు చేరారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో మూడో సీడ్‌ సింధు 21–23, 21–13, 21–18తో బుసానన్‌ (థాయ్‌లాండ్‌)పై విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన తొలి గేమ్‌లో ఓటమి పాలైన సింధు... వెంటనే తేరుకొని ప్రత్యర్థి ఆట కట్టించింది. పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో ఏడో సీడ్‌ శ్రీకాంత్‌ 21–12, 15–21, 24–22తో సుపన్యు అవింగ్‌సనోన్‌ (థాయ్‌లాండ్‌)పై గెలిచాడు. తొలి గేమ్‌లో సునాయాసంగా గెలిచిన శ్రీకాంత్‌ ఆ తర్వాత చెమటోడ్చాల్సి వచ్చింది. ముఖ్యంగా చివరి గేమ్‌లో ఇద్దరు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డారు. ఎట్టకేలకు రెండు గేమ్‌ పాయింట్లు కాచుకున్న శ్రీకాంత్‌ విజేతగా నిలిచాడు. క్వార్టర్స్‌లో ఐదో సీడ్‌ చెన్‌ యుఫె (చైనా)తో సింధు, మూడో సీడ్‌ కెంటో మొమోటో (జపాన్‌)తో శ్రీకాంత్‌ తలపడనున్నారు.  

డబుల్స్‌లో నిష్క్రమణ... 
డబుల్స్‌ విభాగాల్లో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో ప్రపంచ 25వ ర్యాంక్‌ జంట సాత్విక్‌ సాయిరాజ్‌ – అశ్విని పొన్నప్ప 14–21, 11–21తో టాప్‌ సీడ్‌ జెంగ్‌ సివె–హువాంగ్‌ యాకియోంగ్‌ (చైనా) ద్వయం చేతిలో ఓడగా... మరో జోడి సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా 16–21, 10–21తో ఆరో సీడ్‌ మథియాస్‌ క్రిస్టియాన్సన్‌–క్రిస్టినా పెడర్సన్‌ (డెన్మార్క్‌) జంట చేతిలో పరాజయం పాలైంది. పురుషుల డబుల్స్‌లో సుమీత్‌ రెడ్డి–మనూ అత్రి జంట 9–21, 10–21తో చెన్‌ హంగ్‌ లింగ్‌–వాంగ్‌ చి లిన్‌ (చైనీస్‌ తైపీ) జోడీ చేతిలో ఓడింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement