breaking news
China Open quarters
-
క్వార్టర్స్లో సింధు, శ్రీకాంత్
చాంగ్జౌ (చైనా): స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ చైనా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్కు చేరారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో మూడో సీడ్ సింధు 21–23, 21–13, 21–18తో బుసానన్ (థాయ్లాండ్)పై విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన తొలి గేమ్లో ఓటమి పాలైన సింధు... వెంటనే తేరుకొని ప్రత్యర్థి ఆట కట్టించింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో ఏడో సీడ్ శ్రీకాంత్ 21–12, 15–21, 24–22తో సుపన్యు అవింగ్సనోన్ (థాయ్లాండ్)పై గెలిచాడు. తొలి గేమ్లో సునాయాసంగా గెలిచిన శ్రీకాంత్ ఆ తర్వాత చెమటోడ్చాల్సి వచ్చింది. ముఖ్యంగా చివరి గేమ్లో ఇద్దరు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డారు. ఎట్టకేలకు రెండు గేమ్ పాయింట్లు కాచుకున్న శ్రీకాంత్ విజేతగా నిలిచాడు. క్వార్టర్స్లో ఐదో సీడ్ చెన్ యుఫె (చైనా)తో సింధు, మూడో సీడ్ కెంటో మొమోటో (జపాన్)తో శ్రీకాంత్ తలపడనున్నారు. డబుల్స్లో నిష్క్రమణ... డబుల్స్ విభాగాల్లో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్స్లో ప్రపంచ 25వ ర్యాంక్ జంట సాత్విక్ సాయిరాజ్ – అశ్విని పొన్నప్ప 14–21, 11–21తో టాప్ సీడ్ జెంగ్ సివె–హువాంగ్ యాకియోంగ్ (చైనా) ద్వయం చేతిలో ఓడగా... మరో జోడి సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా 16–21, 10–21తో ఆరో సీడ్ మథియాస్ క్రిస్టియాన్సన్–క్రిస్టినా పెడర్సన్ (డెన్మార్క్) జంట చేతిలో పరాజయం పాలైంది. పురుషుల డబుల్స్లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి జంట 9–21, 10–21తో చెన్ హంగ్ లింగ్–వాంగ్ చి లిన్ (చైనీస్ తైపీ) జోడీ చేతిలో ఓడింది. -
క్వార్టర్స్లో సానియా జంట
బీజింగ్: వరుసగా నాలుగో టైటిల్పై గురి పెట్టిన సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట చైనా ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో శుభారంభం చేసింది. టాప్ సీడ్ హోదాలో తొలి రౌండ్లో ‘బై’ పొందిన ఈ ఇండో-స్విస్ జోడీ... బుధవారం జరిగిన రెండో రౌండ్లో 1-6, 6-4, 10-6తో ‘సూపర్ టైబ్రేక్’లో సారా ఎరాని-ఫ్లావియా పెనెట్టా (ఇటలీ) జంటపై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 76 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సానియా ద్వయం తొలి సెట్ను కోల్పోయినా... రెండో సెట్లో వెంటనే తేరుకుంది. నిర్ణాయక సూపర్ టైబ్రేక్లో సమన్వయంతో ఆడి విజయాన్ని ఖాయం చేసుకుంది. సానియా జోడీ 13 మ్యాచ్ల తర్వాత ప్రత్యర్థి జంటకు సెట్ను చేజార్చుకోవడం గమనార్హం. మరోవైపు ఇదే వేదికపై జరుగుతున్న ఏటీపీ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)-జాన్ ఇస్నెర్ (అమెరికా) జంటకు తొలి రౌండ్లోనే చుక్కెదురైంది. ఏకపక్షంగా జరిగిన మ్యాచ్లో బోపన్న-ఇస్నెర్ జోడీ 4-6, 3-6తో ట్రయెస్కీ (సెర్బియా)-పాబ్లో క్యువాస్ (ఉరుగ్వే) ద్వయం చేతిలో ఓడిపోయింది. బోపన్న ఓటమితో భారత ఆటగాళ్ల పోరాటం ముగిసింది. జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా)తో జతకట్టిన లియాండర్ పేస్ కూడా తొలి రౌండ్లోనే ఓడిపోయాడు.