ధోని ధమాకా సరిపోలేదు | Punjab hold on to win by four runs despite MS Dhoni heroics | Sakshi
Sakshi News home page

ధోని ధమాకా సరిపోలేదు

Apr 16 2018 1:09 AM | Updated on Apr 16 2018 8:08 AM

Punjab hold on to win by four runs despite MS Dhoni heroics - Sakshi

మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ గేల్‌ 

మొహాలి: ఐపీఎల్‌లో మరో ఉత్కంఠభరిత ముగింపు... మహేంద్ర సింగ్‌ ధోని  (44 బంతుల్లో 79 నాటౌట్‌; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) అద్భుత ప్రదర్శనతో సూపర్‌ కింగ్స్‌ను విజయానికి చేరువగా తెచ్చినా చివరకు పంజాబ్‌దే పైచేయి అయింది. విజయానికి చివరి ఓవర్లో 17 పరుగులు కావాల్సి ఉండగా,  చెన్నై 12 పరుగులు మాత్రమే చేయగలిగింది. అంతకుముందు రెండు ఓవర్లలో కలిపి ధోని ధమాకా బ్యాటింగ్‌తో 38 పరుగులు రాగా... వెన్నునొప్పితో సరిగ్గా కదల్లేకపోయిన చెన్నై కెప్టెన్‌ ఆఖరి ఓవర్లో లాంఛనం పూర్తి చేయలేకపోయాడు. ఆదివారం ఇక్కడి పీసీఏ స్టేడియంలో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో పంజాబ్‌ 4 పరుగుల తేడాతో చెన్నైను ఓడించింది. సొంతగడ్డపై అశ్విన్‌ సేనకు ఇది రెండో విజయం. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది.

ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన క్రిస్‌ గేల్‌ (33 బంతుల్లో 63; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) తనదైన శైలిలో చెలరేగి అర్ధ సెంచరీ సాధించగా, మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (22 బంతుల్లో 37; 7 ఫోర్లు) అండగా నిలిచాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 48 బంతుల్లోనే 96 పరుగులు జోడించడం విశేషం. ఆ తర్వాత మయాంక్‌ అగర్వాల్‌ (19 బంతుల్లో 30; 1 ఫోర్, 2 సిక్స్‌లు), కరుణ్‌ నాయర్‌ (17 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా దూకుడుగా ఆడటంతో పంజాబ్‌ భారీ స్కోరు సాధించింది. చెన్నై బౌలర్లలో ఠాకూర్, తాహిర్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం చెన్నై సూపర్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 193 పరుగులు చేసింది. ధోని మెరుపు బ్యాటింగ్‌ చేయగా, అంబటి రాయుడు (35 బంతుల్లో 49; 5 ఫోర్లు, ఒక సిక్స్‌) కూడా మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. టైకి 2 వికెట్లు దక్కాయి.   

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement
 
Advertisement
Advertisement