టైటిల్‌కు చేరువలో ప్రాచుర్య కుమార్


ఆలిండియా ఫిడే రేటింగ్ బ్లైండ్ చెస్

 సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ఫిడే రేటింగ్ అంధుల చెస్ టోర్నమెంట్‌లో ఒరిస్సా ఆటగాడు ప్రాచుర్య కుమార్ ప్రధాన్ టైటిల్‌కు చేరువయ్యాడు. బేగంపేట్‌లోని దేవనార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో ప్రాచుర్య ఏడున్నర పాయింట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. బుధవారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌లో అతను ఢిల్లీకి చెందిన అఖిలేశ్ శ్రీవాస్తవ (6)పై విజయం సాధించాడు. తొమ్మిది రౌండ్ల ఈ టోర్నమెంట్‌లో ఇక మిగిలింది ఒకే రౌండ్ కావడంతో... ప్రాచుర్య (7.5) టైటిల్ రేసులో నిలిచాడు. ఇతనికి ఏడు పాయింట్లు ఖాతాలో ఉన్న విజయ్ కరియా (గుజరాత్) నుంచి కాస్త పోటీ ఎదురవనుంది. ఆంధ్రప్రదేశ్ ఆటగాడు వెంకట్ రెడ్డి తదితరులు ఆరు పాయింట్లతో ఉమ్మడిగా నాలుగో స్థానంలో ఉన్నారు. ఎనిమిదో రౌండ్ పోటీల్లో వెంకట్ రెడ్డి (6)... మోహన్ నారాయణ్ (మహారాష్ట్ర, 5)పై, విజయ్ కరియా (7)... సౌందర్య కుమార్ ప్రధాన్ (ఒరిస్సా, 6)పై, అశ్విన్ మక్వానా (గుజరాత్, 6.5)... శశిధర్ (కర్ణాటక, 5.5)పై గెలుపొందారు.

 

 బలరామన్ (కేరళ, 6.5)... శోభ లోఖండే (మహారాష్ట్ర, 5.5)పై నెగ్గగా, అతుల్ కకడే (మహారాష్ట్ర, 6)... సుమన్ కుమార్ (బీహార్, 5.5)తో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. ఉడుపా కృష్ణ (కర్ణాటక, 6) చేతిలో మయాంక్ శర్మ (ఢిల్లీ, 5)కు చుక్కెదురవగా, చిరంతన్ మెసారియా (గుజరాత్, 5.5)... స్వప్నిల్ షా (మహారాష్ట్ర, 5.5)తో, ముత్తురామన్ (తమిళనాడు, 5.5)... సుధీర్ కుమార్ నాయక్ (ఒరిస్సా, 5.5)తో గేమ్‌లను డ్రా చేసుకున్నారు. నేడు (గురువారం) చివరి రౌండ్ పోటీలు జరుగుతాయి. ఈ టోర్నీలో14 రాష్ట్రాల నుంచి 111 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top