4 బంతుల్లో 4 వికెట్లు 

Mohammed Mudhasir claims 4 wickets in 4 balls in a Ranji Trophy game - Sakshi

జమ్మూకశ్మీర్‌ బౌలర్‌ ముదస్సిర్‌ ఘనత   

జైపూర్‌: దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ 2018–19 సీజన్‌లో అరుదైన ఘనత నమోదైంది. రాజస్తాన్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో జమ్మూకశ్మీర్‌ పేసర్‌ ముదస్సిర్‌ 4 వరుస బంతుల్లో 4 వికెట్లు పడగొట్టాడు. రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌లో 99వ ఓవర్‌ బౌలింగ్‌ చేసిన ముదస్సిర్‌ (5/90) మూడో బంతికి చేతన్‌ బిస్త్‌ (159; 24 ఫోర్లు)ను ఆ తర్వాత వరుసగా తజిందర్‌ సింగ్‌ (0), రాహుల్‌ చహర్‌ (0), తన్వీర్‌ ఉల్‌ హఖ్‌ (0)లను ఎల్బీడబ్ల్యూలుగా పెవిలియన్‌ పంపాడు. రంజీ చరిత్రలో వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు తీయడం ఇది రెండో సారైతే... ఆ నాలుగు ఎల్బీడబ్ల్యూలే కావడం ఇదే తొలిసారి. ఇంతకుముందు ఢిల్లీ ఆటగాడు శంకర్‌ సైనీ (1988 హిమాచల్‌ ప్రదేశ్‌పై) ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 379 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన జమ్మూకశ్మీర్‌ శుక్రవారం ఆట ముగిసే సమయానికి 62 ఓవర్లలో 7 వికెట్లకు 186 పరుగులు చేసింది.   

మరో హ్యాట్రిక్‌..: మధ్యప్రదేశ్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో తమిళనాడు పేసర్‌ ఎం. మొహమ్మద్‌ మరో హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. మధ్యప్రదేశ్‌ ఇన్నింగ్స్‌ 142వ ఓవర్‌ చివరి బంతికి యశ్‌ దూబే (6)ను ఔట్‌ చేసిన మొహమ్మద్‌ (4/98) తన మరుసటి ఓవర్‌ తొలి రెండు బంతులకు రజత్‌ పాటిదార్‌ (196; 17 ఫోర్లు, 1 సిక్స్‌), మిహిర్‌ హిర్వాణి (0)లను పెవిలియన్‌ పంపి హ్యాట్రిక్‌ పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 393 పరుగులకు ఆలౌటైంది. సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన తమిళనాడు 2 ఓవర్లలో పరుగులేమి చేయలేదు.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top