సెలక్టర్లకు వార్నింగ్‌.. మళ్లీ శతక్కొట్టిన టీమిండియా స్టార్‌ | Karun Nair hits another Ranji Trophy century, aims for Team India comeback | Sakshi
Sakshi News home page

టీమిండియా నుంచి తీసేశారు.. కట్‌ చేస్తే! ఆ కోపం అక్కడ చూపించేస్తున్నాడు

Nov 1 2025 4:07 PM | Updated on Nov 1 2025 5:10 PM

Karun Nair Slams Century Against Kerala

రంజీ ట్రోఫీ-2025 సీజన్‌లో టీమిండియా వెటరన్‌, కర్ణాటక స్టార్ బ్యాటర్ కరుణ్ నాయర్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. భారత టెస్ట్ జట్టులోకి తిరిగి రావాలనే లక్ష్యంతో ఉన్న నాయర్‌.. మరో అద్బుతమైన ఫస్ట్ క్లాస్‌ సెంచరీతో చెలరేగాడు.

రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూపులో భాగంగా తిరువనంతపురం వేదికగా కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో కరుణ్ నాయర్ శతక్కొట్టాడు. కేవలం 163 బంతుల్లోనే తన 26వఫస్ట్ క్లాస్ సెంచరీ మార్క్‌ను అతడు అందుకున్నాడు. నాయర్ ప్రస్తుతం 116 పరుగులతో తన బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నాడు. 

గత కొంతకాలంగా విదర్భ తరఫున ఆడిన కరుణ్ నాయర్..  ప్రస్తుత రంజీ సీజన్‌లో తన సొంత జట్టు కర్ణాటకకు తిరిగి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.  సౌరాష్ట్రతో జరిగిన తొలి మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన నాయర్‌(73).. ఆ తర్వాత గోవాతో జరిగిన మ్యాచ్‌లో భారీ శతకం(174)తో కదం తొక్కాడు. ఇప్పుడు కేరళపై కూడా మూడంకెల స్కోరును అందుకున్నారు.

కరుణ్ మళ్లీ ఎంట్రీ ఇస్తాడా?
కాగా దాదాపు ఎనిమిదేళ్ల విరామం త‌ర్వాత భార‌త జ‌ట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన నాయ‌ర్‌.. ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో నాలుగు టెస్టులు ఆడి కేవలం 25.63 సగటుతో 205 పరుగులు మాత్రమే చేశాడు. అత‌డి ఇన్నింగ్స్‌ల‌లో కేవ‌లం ఒక్క హాఫ్ సెంచ‌రీ మాత్ర‌మే ఉంది.

దీంతో స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌కు కరుణ్ నాయర్‌ను జట్టు నుంచి సెల‌క్ట‌ర్లు తొలగించారు. అతడి స్థానంలో యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్‌కు అవకాశం కల్పించారు. అయితే జ‌ట్టు నుంచి తొలగించడంపై కరుణ్ నాయర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాను ఒక సిరీస్ కంటే ఎక్కువ అవకాశాలకు అర్హుడిని అని చెప్పుకొచ్చాడు. మ‌ళ్లీ టీమిండియాలోకి వ‌స్తానిని ఈ క‌ర్ణాట‌క బ్యాట‌ర్ థీమా వ్య‌క్తం చేశాడు.
చదవండి: ENG vs NZ: ఇంగ్లండ్‌కు ఘోర ప‌రాభ‌వం.. 42 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి

Advertisement
 
Advertisement
Advertisement