వాళ్లకు తెలియకుండానే జరిగిందా? | Sakshi
Sakshi News home page

బాల్‌ ట్యాంపరింగ్‌పై మండిపడ్డ పీటర్సన్‌

Published Mon, Mar 26 2018 12:28 PM

Kevin Pietersen Urges CA to Sack Steve Smith - Sakshi

సాక్షి, స్పోర్ట్స్‌ : గత రెండు రోజులుగా క్రికెట్‌ అభిమానులను కలవరపాటుకు గురిచేస్తున్న బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంపై పలువురు క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ‘వ్యక్తిని బట్టి, ప్రాతినిథ్య జట్టును బట్టి శిక్షలు ఖారారు చేయడం ఐసీసీ తీరును తెలియజేస్తుంది.. వారెవ్వా ఐసీసీ’ అంటూ హర్భజన్‌ మండిపడిన విషయం తెలిసిందే.

తాజాగా ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌, దిగ్గజ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌ కూడా ఈ వివాదంపై స్పందించాడు. ‘కోచ్‌తో సహా ఆటగాళ్లంతా కలిసి క్రికెట్‌ను ఎంతగానో ప్రేమించే ఆస్ట్రేలియాను, టెస్ట్‌ క్రికెట్‌ను అవమానపరిచారు. మీరు చేసిన ఈ పని ఏమాత్రం సరైంది కాదు. జట్టు కోచ్‌ లీమన్‌, బౌలింగ్‌ కోచ్‌ డేవిడ్‌ సాకర్‌కు తెలియకుండానే ఇదంతా జరిగిందా? వీరిద్దరిపై కూడా చర్యలు తీసుకోవాల’ని పీటర్సన్‌ ట్వీట్‌ చేశాడు. కెప్టెన్‌ స్మిత్‌, వైస్‌ కెప్టెన్‌ వార్నర్‌లకు క్రికెట్‌ ఆస్ట్రేలియా ఇప్పటికే ఉద్వాసన పలికింది. కాగా ఈ వివాదంపై క్రికెట్‌ ఆస్ట్రేలియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ జేమ్స్‌ సదర్లాండ్‌ ఆస్ట్రేలియా అభిమానులకు బహిరంగ క్షమాపణలు చెప్పారు.

పరువు తీసేలా ప్రవర్తించకండి: ఏఎస్‌సీ
ఆస్ట్రేలియా స్పోర్ట్స్‌ కమిషన్‌ అధికారి జాన్‌ వీలీ, బోర్డు సీఈఓ కేట్‌ పామర్‌ మాట్లాడుతూ.. ఏ ఆటలోనైనా మోసానికి పాల్పడితే ఒప్పుకోబోమని, బాల్‌ ట్యాంపరింగ్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, కోచ్‌, సహాయ సిబ్బందితో పాటు, జట్టులోని ఇతర సభ్యులెవరైనా సీఏ ముందు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ అంశంలో ఎవరెవరు భాగమై ఉన్నారనేది తెలుకోవాల్సి ఉందని ఏఎస్‌సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆస్ట్రేలియా అథ్లెట్లు, ఇతర జట్లు అన్నీ నిజాయితీగా వ్యవహరించాలని.. క్రీడాస్ఫూర్తి కలిగి ఉండాలని కోరింది.

Advertisement
Advertisement