సింధు, శ్రీకాంత్‌ శుభారంభం | India Open: PV Sindhu, Kidambi Srikanth advance to second round | Sakshi
Sakshi News home page

సింధు, శ్రీకాంత్‌ శుభారంభం

Mar 28 2019 12:42 AM | Updated on Mar 28 2019 12:42 AM

India Open: PV Sindhu, Kidambi Srikanth advance to second round - Sakshi

న్యూఢిల్లీ: మాజీ చాంపియన్స్‌ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌ ఇండియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో సింధు 21–8, 21–13తో ముగ్ధా ఆగ్రే (భారత్‌)పై... పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌ 21–16, 18–21, 21–19తో వోంగ్‌ వింగ్‌ కి విన్సెంట్‌ (హాంకాంగ్‌)పై గెలిచారు. ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో సమీర్‌ వర్మ 21–18, 21–12తో రాస్‌ముస్‌ గెమ్కె (డెన్మార్క్‌)పై, సాయిప్రణీత్‌ 22–24, 21–18, 21–8తో కార్తికేయ్‌ (భారత్‌)పై, కశ్యప్‌ 14–21, 21–18, 21–10తో లీ చెయుక్‌ (హాంకాంగ్‌)పై, శుభాంకర్‌ 14–21, 22–20, 21–11తో నాలుగో సీడ్‌ టామీ సుగియార్తో (ఇండోనేసియా)పై, ప్రణయ్‌ 14–21, 21–18, 21–14తో వాంగ్‌చరోయెన్‌ (థాయ్‌లాండ్‌)పై గెలిచారు.

సుగియార్తోతో జరిగిన మ్యాచ్‌లో శుభాంకర్‌ రెండో గేమ్‌లో 12–19తో వెనుకబడిన దశలో వరుసగా ఏడు పాయింట్లు స్కోరు చేసి 19–19తో సమం చేశాడు. ఆ తర్వాత మరో పాయింట్‌ కోల్పోయినా... వెంటనే తేరుకొని వరుసగా మూడు పాయింట్లు నెగ్గి గేమ్‌ను దక్కించుకున్నాడు. మూడో గేమ్‌లో శుభాంకర్‌ పూర్తి ఆధిపత్యం చలాయించాడు. భారత్‌కే చెందిన రాహుల్‌ యాదవ్‌ 14–21, 6–21తో జార్గెన్‌సన్‌ (డెన్మార్క్‌) చేతిలో, అజయ్‌ జయరామ్‌ 15–21, 18–21తో వాంగ్‌జు వె (చైనీస్‌ తైపీ) చేతిలో ఓటమి చవిచూశారు.
 
మహిళల సింగిల్స్‌ ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో గుమ్మడి వృశాలి 21–17, 20–22, 12–21తో చనాన్‌చిదా (థాయ్‌లాండ్‌) చేతిలో, సాయిఉత్తేజిత 9–21, 6–21తో రచనోక్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో... ప్రాషి జోషి 12–21, 15–21తో హి బింగ్‌జియావో (చైనా) చేతిలో ఓడిపోయారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా 21–14, 21–13తో గ్రాచెవ్‌–బొలొతోవా (రష్యా)లపై; మనీషా–అర్జున్‌ 21–15, 21–15తో సుమీత్‌ రెడ్డి–పూజాలపై గెలిచారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement