దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతున్న నాలుగు రోజుల అనధికార రెండో టెస్టులో భారత్ ‘ఎ’ జట్టు తడబడింది.
భారత్ ‘ఎ’తడబాటు
Aug 26 2013 1:56 AM | Updated on Sep 1 2017 10:07 PM
ప్రిటోరియా: దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరుగుతున్న నాలుగు రోజుల అనధికార రెండో టెస్టులో భారత్ ‘ఎ’ జట్టు తడబడింది. టాప్ ఆర్డర్లో పుజారా (54), రహానే (36) మినహా మిగతా వారు నిరాశపర్చారు. దీంతో ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 51.3 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులు చేసింది. హైదరాబాద్ బ్యాట్స్మన్ రాయుడు (14 బ్యాటింగ్), పర్వేజ్ రసూల్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ ఇంకా 196 పరుగులు వెనుకబడి ఉంది. ఓపెనర్లలో పుజారా నిలకడను కనబర్చినా... విజయ్ (4) విఫలమయ్యాడు. రెండో ఓవర్లోనే హెండ్రిక్స్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు.
తర్వాత రహానే , పుజారాలు మంచి సమన్వయంతో ఆడి రెండో వికెట్కు 86 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను గాడిలో పెట్టారు. ఈ క్రమంలో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న పుజారాను హెండ్రిక్స్ మరోసారి బోల్తా కొట్టించాడు. తర్వాత వచ్చిన కార్తీక్ (0) నిరాశపర్చినా... రాయుడు వికెట్ కాపాడుకోవడానికి ప్రాధాన్యమిచ్చాడు. ఈ దశలో నిలకడగా ఆడుతున్న రహానే... హెండ్రిక్స్ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసి వికెట్ల ముందు దొరికిపోయాడు. చివర్లో సాహా (14), బిన్ని (0) ఒక్క పరుగు వ్యవధిలో అవుట్ కావడంతో భారత్ కోలుకోలేకపోయింది. హెండ్రిక్స్ 3, హార్మర్ 2, అబాట్ ఒక్క వికెట్ తీశారు.
Advertisement
Advertisement