కర్ణాటకతో హైదరాబాద్‌ మ్యాచ్‌ డ్రా

సాక్షి, హైదరాబాద్‌: విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీ అండర్‌–16 క్రికెట్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ రెండో ‘డ్రా’ను నమోదు చేసింది. జింఖానా మైదానంలో కర్ణాటక, హైదరాబాద్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. టోర్నీలో ఇప్పటి వరకు హైదరాబాద్‌ ఆడిన రెండు మ్యాచ్‌లూ ‘డ్రా’గానే ముగిశాయి. ఆదివారం ఓవర్‌నైట్‌ స్కోరు 105/1తో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన కర్ణాటక 92 ఓవర్లలో 6 వికెట్లకు 270 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.

జై బోరా (106; 8 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ చేయగా... అనిరుధ్‌ శ్రీనివాస్‌ (71; 10 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. స్మరణ్‌ (48; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. హైదరాబాద్‌ బౌలర్లలో ఎస్‌. నిఖిల్‌ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన హైదరాబాద్‌ మూడోరోజు ఆటముగిసే సమయానికి 49 ఓవర్లలో 4 వికెట్లకు 99 పరుగులతో నిలిచింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో 187 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించిన కర్ణాటకు 3 పాయింట్లు లభించాయి. హైదరాబాద్‌ ఖాతాలో ఒక పాయింట్‌ చేరింది. ఈనెల 12న మూలపాడులో జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో ఆంధ్రతో హైదరాబాద్‌ ఆడుతుంది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top