సెమీఫైనల్లో శ్రీకాంత్‌

Denmark Open: Kidambi Srikanth beats Sameer Verma  - Sakshi

ఓడెన్స్‌: డెన్మార్క్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ కిడాంబి శ్రీకాంత్‌ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ ఆరో ర్యాంకర్‌ శ్రీకాంత్‌ 78 నిమిషాల్లో 22–20, 19–21, 23–21తో భారత్‌కే చెందిన సమీర్‌ వర్మను ఓడించాడు. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్‌ కెంటో మొమోటా (జపాన్‌)తో శ్రీకాంత్‌ తలపడతాడు. ముఖాముఖి రికార్డులో శ్రీకాంత్‌ 3–8తో వెనుకంజలో ఉన్నాడు. 2015 ఇండియా ఓపె న్‌లో చివరిసారి కెంటో మొమోటాపై నెగ్గిన శ్రీకాంత్‌ ఆ తర్వాత వరుసగా ఐదు సార్లు ఈ జపాన్‌ ప్లేయర్‌ చేతిలో ఓడిపోయాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో శ్రీకాంత్‌ 18–21, 21–17, 21–16తో బ్యాడ్మింటన్‌ దిగ్గజం లిన్‌ డాన్‌ (చైనా)పై సంచలన విజయం సాధించాడు. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్, రెండుసార్లు ఒలింపిక్‌ విజేత, నాలుగుసార్లు ఆసియా చాంపియన్‌ అయిన 35 ఏళ్ల లిన్‌ డాన్‌పై శ్రీకాంత్‌ నెగ్గడం ఇది రెండోసారి. మరో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సమీర్‌ వర్మ 23–21, 6–21, 22–20తో ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా)పై గెలిచి క్వార్టర్స్‌కు చేరాడు.  

సైనా సంచలనం... 
మహిళల సింగిల్స్‌ విభాగంలో ప్రపంచ రెండో ర్యాంకర్‌ అకానె యామగుచి (జపాన్‌)తో జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సైనా 21–15, 21–17తో సంచలన విజయం సాధించింది. 2014 చైనా ఓపెన్‌లో చివరిసారి యామగుచిని ఓడించిన సైనా ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఈ జపాన్‌ ప్లేయర్‌ చేతిలో ఓడింది. ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత మళ్లీ యామగుచిపై గెలిచి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. మహిళల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్‌) జంట 18–21, 22–20, 21–18తో ఏడో సీడ్‌ లీ సో హీ–షిన్‌ సెయుంగ్‌ చాన్‌ (దక్షిణ కొరియా) జోడీపై సంచలన విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top