సీబీఐటీ జట్టుకు టైటిల్‌ | CBIT Team Gets Badminton Title | Sakshi
Sakshi News home page

సీబీఐటీ జట్టుకు టైటిల్‌

Sep 22 2019 1:54 PM | Updated on Sep 22 2019 1:54 PM

CBIT Team Gets Badminton Title - Sakshi

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీ  ఇంటర్‌ కాలేజి బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో ఆతిథ్య చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (సీబీఐటీ–గండిపేట) జట్టు విజేతగా నిలిచింది.  శనివారం ఫైనల్‌ మ్యాచ్‌లో సీబీఐటీ 2–0తో భవన్స్‌ (సైనిక్‌పురి)పై విజయం సాధించింది. తొలి సింగిల్స్‌ మ్యాచ్‌లో దహేశ్‌ (సీబీఐటీ) 21–12, 21–16తో నిఖిల్‌ కుమార్‌పై గెలుపొందగా... రెండో మ్యాచ్‌లో మనీశ్‌ (సీబీఐటీ) 21–13, 21–13తో శశాంక్‌ను ఓడించాడు. మూడో స్థానం కోసం జరిగిన పోరులో సీఎస్‌ఐ కాలేజి 2–1తో బద్రుకా కాలేజిని ఓడించింది. తొలి సింగిల్స్‌లో నీరజ్‌ (సీఎస్‌ఐ) 21–19, 18–21, 21–16తో భరత్‌ (బద్రుకా)పై గెలుపొందగా... రెండో మ్యాచ్‌లో రాహుల్‌ (బద్రుకా) 21–18, 21–19తో అఖిల్‌ను ఓడించి స్కోరును 1–1తో సమం చేశాడు.

నిర్ణాయక డబుల్స్‌ మ్యాచ్‌లో నీరజ్‌–అఖిల్‌ ద్వయం 22–20, 21–19తో రమనీత్‌ సింగ్‌–రాహుల్‌ జోడీపై గెలుపొంది మూడోస్థానంలో నిలిచింది. అంతకుముందు జరిగిన సెమీస్‌ మ్యాచ్‌ల్లో భవన్స్‌ (సైనిక్‌పురి) 2–1తో బద్రుకా జట్టుపై, సీబీఐటీ 2–1తో సీఎస్‌ఐ జట్టుపై విజయం సాధించాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో సీబీఐటీ కాలేజి ప్రిన్సిపాల్‌ పి. రవీందర్‌ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో యూసీపీఈ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ రాజేశ్‌ కుమార్, ఓయూ ఐసీటీ కార్యదర్శి ప్రొఫెసర్‌ కె. దీప్లా తదితరులు పాల్గొన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement