‘బుష్‌ ఫైర్‌ బాష్‌’ వేదిక మారింది!  | Bushfire Bash moved to Junction Oval | Sakshi
Sakshi News home page

‘బుష్‌ ఫైర్‌ బాష్‌’ వేదిక మారింది! 

Feb 7 2020 10:01 AM | Updated on Feb 7 2020 10:01 AM

Bushfire Bash moved to Junction Oval - Sakshi

సిడ్నీ: ఆస్ట్రేలియాను ఇటీవల కుదిపేసిన కార్చిచ్చు బాధితుల సహాయార్థం నిధుల సేకరణ కోసం తలపెట్టిన ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ వేదిక, తేదీ మారాయి. ‘బుష్‌ ఫైర్‌ బాష్‌’ పేరుతో పలువురు మాజీ క్రికెటర్లు పాల్గొంటున్న ఈ మ్యాచ్‌ శనివారానికి బదులుగా ఆదివారం నిర్వహిస్తారు. వేదికను కూడా సిడ్నీ నుంచి మెల్‌బోర్న్‌కు మార్చారు. వాతావరణ శాఖ సూచన ప్రకారం శనివారం సిడ్నీలో భారీ వర్షం కురిసే అవకాశం ఉండటమే అందుకు కారణం. మెల్‌బోర్న్‌లోని జంక్షన్‌ ఓవల్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో ఒక్కో జట్టు 10 ఓవర్ల చొప్పున ఆడుతుంది. 

దీంతో పాటు మహిళల జట్లు ఆడుతున్న రెండు అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు, బిగ్‌బాష్‌ లీగ్‌ ఫైనల్‌ కూడా నిధుల సేకరణలో భాగంగా ఉన్నాయి. ఈ నాలుగు మ్యాచ్‌ల ద్వారా వచ్చిన లాభాలను రెడ్‌ క్రాస్‌కు అందజేస్తారు. ‘బుష్‌ ఫైర్‌ బాష్‌’లో రెండు జట్లలో ఒకదానికి సచిన్‌ కోచ్‌గా వ్యవహరిస్తుండటం విశేషం. మరో టీమ్‌కు ఆసీస్‌ ప్రస్తుత టెస్టు కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ కోచ్‌గా పని చేస్తాడు.  

జట్ల వివరాలు:  పాంటింగ్‌ ఎలెవన్‌: హేడెన్, లాంగర్, పాంటింగ్, విలాని, లారా, లిచ్‌ఫీల్డ్, హాడిన్, బ్రెట్‌ లీ, వసీం అక్రమ్, క్రిస్టియాన్, ల్యూక్‌ హాడ్జ్, సచిన్‌ (కోచ్‌). గిల్‌క్రిస్ట్‌ ఎలెవన్‌: గిల్‌క్రిస్ట్, వాట్సన్, బ్రాడ్‌ హాడ్జ్, యువరాజ్‌ సింగ్, బ్లాక్‌వెల్, సైమండ్స్, కోట్నీ వాల్ష్‌, సిడిల్, రీవోల్ట్‌.  

Advertisement
 
Advertisement
Advertisement