‘ఏబీ’ బాదుడు... | Bangalore won against mumbai | Sakshi
Sakshi News home page

‘ఏబీ’ బాదుడు...

May 11 2015 12:32 AM | Updated on Sep 3 2017 1:48 AM

‘ఏబీ’ బాదుడు...

‘ఏబీ’ బాదుడు...

బెంగళూరు పంజాకు ఈసారి ముంబై ఇండియన్స్ బలయ్యింది. గత మ్యాచ్‌లో గేల్ దుమారంలో పంజాబ్ గల్లంతైతే...

59 బంతుల్లోనే 133 పరుగులు చేసిన డివిలియర్స్
బెంగళూరు చేతిలో ముంబై చిత్తు
రాణించిన కోహ్లి

 
 బెంగళూరు పంజాకు ఈసారి ముంబై ఇండియన్స్ బలయ్యింది. గత మ్యాచ్‌లో గేల్ దుమారంలో పంజాబ్  గల్లంతైతే... ఈసారి ఏబీ డివిలియర్స్ బాదుడుకు ముంబై హడలెత్తిపోయింది. ప్రతీ బంతిని కసికసిగా బాదిన అతను రోహిత్ బృందానికి చుక్కలు చూపించాడు. డివిలియర్స్ ఇన్నింగ్స్‌లో భారీ సిక్స్‌లు లేకపోయినా... దానికి ఏమాత్రం తీసిపోని రీతిలో చూడముచ్చటైన 19 ఫోర్లతో అదరగొట్టాడు. మొత్తంగా సిక్స్‌లు, ఫోర్లతోనే సరిగ్గా వంద పరుగులు సాధించిన ఈ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ విధ్వంసం ఏ స్థాయిలో సాగిందో ఊహించుకోవచ్చు.ఓవరాల్‌గా అతను ఈ సీజన్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (133 నాటౌట్) సాధించగా.. అటు కోహ్లి కూడా తన సహజ శైలిలో ధాటిగా ఆడి జట్టు స్కోరును భారీగా పెంచాడు. సిమ్మన్స్, పొలార్డ్ రూపంలో కొద్దిగా పోరాడినా ముంబై ఇండియన్స్‌కు ఓటమి తప్పలేదు.
 
 ముంబై : ముంబై ఇండియన్స్ వరుస ఐదు విజయాలకు సొంతగడ్డపైనే బ్రేక్ పడింది. వాంఖడే మైదానంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 39 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. ఏబీ డివిలియర్స్ (59 బంతుల్లో 133 నాటౌట్; 19 ఫోర్లు; 4 సిక్సర్లు) భీకరమైన ఆటతీరుతో విరుచుకుపడగా... కెప్టెన్ విరాట్ కోహ్లి (50 బంతుల్లో 82 నాటౌట్; 6 ఫోర్లు; 4 సిక్సర్లు) మెరిపించాడు.

వీరిద్దరూ రెండో వికెట్‌కు అజేయంగా 215 పరుగుల టి20ల్లో రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 235 పరుగుల భారీ స్కోరు సాధించింది. గేల్ రూపంలో ఈ జట్టు కోల్పోయిన ఏకైక వికెట్‌ను మలింగ తీశాడు. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ తడబడింది. 20 ఓవర్లలో ఆ జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 196 పరుగులు మాత్రమే చేయగలిగింది.

లెండిల్ సిమ్మన్స్ (53 బంతుల్లో 68 నాటౌట్; 5 ఫోర్లు; 3 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. మధ్యలో కీరన్ పొలార్డ్ (24 బంతుల్లో 49; 6 ఫోర్లు; 2 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. మిగతా వారంతా విఫలమయ్యారు. హర్షల్ పటేల్, చాహల్‌లకు రెండేసి వికెట్లు పడ్డాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా డివిలియర్స్ నిలిచాడు. ఇక ముంబై ప్లే ఆఫ్‌కు వెళ్లాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లను కచ్చితంగా గెలవాలి. మరోవైపు బెంగళూరు మిగిలిన తమ మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్‌కు చేరే అవకాశం ఉంది.

బాదుడే బాదుడు : తొలి ఓవర్‌లో సిక్స్ కొట్టిన క్రిస్ గేల్ (12 బంతుల్లో 13;1 ఫోర్; 1 సిక్స్) ఎక్కువ సేపు క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు. నాలుగో ఓవర్‌లో ఆఫ్ సైడ్ ఆడిన బంతిని లెండిల్ సిమ్మన్స్ అద్భుత రీతిలో ఎడమవైపు గాల్లోకి ఎగిరి అందుకోవడంతో తన ఇన్నింగ్స్ ముగిసింది. అంతకుముందు ఓవర్‌లో గేల్, కోహ్లి క్యాచ్‌లను ఫీల్డర్లు విఫలం చేశారు. ఇక డివిలియర్స్ రాకతో అసలైన ఆట ప్రారంభమైంది.

మలింగ బౌలింగ్‌లో వరుసగా ఐదు బంతుల పాటు పరుగు తీయలేకపో యినా సుజిత్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాది టచ్‌లోకి వచ్చిన ఏబీ ఇక రాకెట్ వేగంతో దూసుకెళ్లాడు. భజ్జీ బౌలింగ్‌లో ఫోర్, సిక్స్‌తో జోరు కనబరిచాడు. ఇదే వేగంతో 29 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. హార్దిక్ పాండ్య వేసిన 15వ ఓవర్‌లో డివిలియర్స్ వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. అటు కోహ్లి కూడా వేగంగా ఆడుతూ 39 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 17వ ఓవర్ నుంచి ఇరువురు ఆటగాళ్లు పూనకం వచ్చినట్టుగా చెలరేగారు.

బుమ్రా వేసిన ఆ ఓవర్‌లో డివిలియర్స్ వరుసగా రెండు సూపర్ సిక్స్‌లతో ఈ సీజన్‌లో తొలి సెంచరీ (47 బంతుల్లో)ని అందుకున్నాడు. కోహ్లి కూడా ఫోర్, సిక్స్ కొట్టడంతో 25 పరుగులు వచ్చాయి. 18వ ఓవర్‌లో 4,6,4తో డివిలియర్స్ చెలరేగాడు. చివరి ఓవర్‌లో కోహ్లి వరుసగా 4,4,6తో దూసుకెళ్లడంతో 17 పరుగులు వచ్చాయి. ఓవరాల్‌గా ముంబై బౌలర్లను చీల్చి చెండాడిన ఈ జోడి చివరి 10 ఓవర్లలో 147 పరుగులు సాధించగా ఇందులో 72 పరుగులు ఆఖరి నాలుగు ఓవర్లలోనే వచ్చాయి.

సిమ్మన్స్ ఒంటరి పోరాటం
 ఆరంభంలో నిదానంగా సాగిన ముం బై ఇన్నింగ్స్‌కు నాలుగో ఓవర్‌లో ఝలక్ తగిలింది. ఫామ్‌లో ఉన్న పార్థీవ్ (11 బంతుల్లో 19;3 ఫోర్లు) రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత రోహిత్ (13 బంతుల్లో 15; 1 ఫోర్; 1 సిక్స్) కూడా తక్కువ స్కోరుకే అవుటయ్యాడు. ఈ దశలో సిమ్మన్స్‌తో కలిసి పొలార్డ్ స్కోరును పరిగెత్తించాడు. భారీ షాట్లతో బెంగళూరు బౌలర్లను బేజారెత్తించాడు. దీంతో 12 ఓవర్లలోనే స్కోరు వంద పరుగులు దాటింది.

అయితే ప్రమాదకరంగా మారిన తనను శ్రీనాథ్ అరవింద్ వెనక్కి పంపాడు. మూడో వికెట్‌కు 6.1 ఓవర్లలోనే వీరి మధ్య 70 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత సిమ్మన్స్ అడపాదడపా బౌండరీలు బాదినా ఫలితం లేకపోయింది. మరోవైపు వచ్చిన ప్రతీ బ్యాట్స్‌మన్ భారీ షాట్ల కోసం ప్రయత్నించి పెవిలియన్‌కు చేరడంతో పరాజయం ఖాయమైంది.
 
 రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ : గేల్ (సి) సిమ్మన్స్ (బి) మలింగ 13; కోహ్లి నాటౌట్ 82; డివిలియర్స్ నాటౌట్ 133; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో వికెట్ నష్టానికి) 235 ; వికెట్ల పతనం: 1-20.
 బౌలింగ్ : మెక్లెనగాన్ 4-0-40-0; మలింగ 4-1-27-1; బుమ్రా 4-0-52-0; సుచిత్ 3-0-35-0; హర్భజన్ 2-0-30-0; పాండ్య 3-0-51-0.

 ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ : పార్థీవ్ (రనౌట్) 19; సిమ్మన్స్ నాటౌట్ 68; రోహిత్ (సి) మన్‌దీప్ (బి) పటేల్ 15; పొలార్డ్ (సి) స్టార్క్ (బి) శ్రీనాథ్ 49; పాండ్య (స్టంప్డ్) కార్తీక్ (బి) చాహల్ 8; రాయుడు (సి) డివిలియర్స్ (బి) పటేల్ 14; హర్భజన్ (సి) కోహ్లి (బి) స్టార్క్ 3; సుచిత్ (సి) కార్తీక్ (బి) చాహల్ 4; మెక్లెనగాన్ నాటౌట్ 12; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి) 196.
 వికెట్ల పతనం : 1-29, 2-63, 3-133, 4-143, 5-174, 6-178, 7-184.
 బౌలింగ్ : స్టార్క్ 4-0-41-1; శ్రీనాథ్ 4-0-29-1; వీస్ 4-0-38-0; పటేల్ 4-0-36-2; చాహల్ 4-0-51-2.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement