
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా పోరాటం చేస్తోన్న వైఎస్సార్సీపీ.. చివరి అస్త్రమైన రాజీనామాలపై ముందడుగువేసింది. పార్లమెంట్ నిరవధికంగా వాయిదాపడ్డ మరుక్షణమే రాజీనామాలు చేస్తామన్నా ఆ పార్టీ ఎంపీలు బుధవారం రాజీనామా లేఖలపై సంతకాలు చేశారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత మేకపాటి రాజమోహన్రెడ్డి, ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, అవినాశ్రెడ్డి, మిథున్రెడ్డి.. సంతకాలు చేసిన రాజీనామా లేఖలతో లోక్సభకు బయలుదేరారు.
కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఎనిమిదో సారి ఇచ్చిన నోటీసులు నేడు సభ ముందుకు రానుంది. అయితే నోటీసులపై స్పీకర్ చర్చ చేపడతారా, లేదా అనేది తేలాల్సిఉంది. అవిశ్వాసాన్ని తప్పించుకునే క్రమంలో కేంద్రం.. ఏఐఏడీఎంకే ఎంపీల నిరసనలను సాకుగా చూపి పార్లమెంట్ సమావేశాలను నిరవధికంగా వాయిదావేసే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎంపీలు ముందస్తుగా స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖలను సిద్ధంచేశారు.