వైఎస్సార్‌సీపీ నేతల అరెస్ట్‌

YSRCP Leaders Arrested In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ : రైతులకు సాగునీరు అందించాలని ఇరిగేషన్‌ శాఖ సూపరిండెంట్‌ ఇంజనీర్‌కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేశారు. జిల్లాలో ఎండిపోతున్న పంటలకు నీళ్లు ఇవ్వాలని ఎస్‌ఈకి వినతిపత్రం ఇచ్చేందుకు బయలుదేరిన పార్థసారధి, జోగి రమేష్‌లను బుధవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ నేతల అక్రమ అరెస్ట్‌లపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. కనీసం వినతి పత్రం కూడా ఇవ్వకుండా పోలీసులను పెట్టి అరెస్ట్‌ చేయిస్తున్నారని మండిపడ్డారు. రైతులకు నీళ్లు ఇవ్వలేని అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు అని వైఎస్సార్‌సీపీ నేత పార్ధసారధి విమర్శించారు.

రైతుల పంటలకు నీళ్లు ఇవ్వమని అడిగితే అక్రమంగా అరెస్ట్‌ చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతులు రోడ్ల మీద కూడా తిరగని పరిస్థితి నెలకొందని ఆయన ఆరోపించారు. ఆగస్ట్‌ నెల వచ్చినా రైతుల పొలాల్లో నీళ్లు లేవని, జల వనరుల శాఖ మంత్రి దేవిదేవి ఉమామహేశ్వరరావు అసమర్ధుడని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు విజయవాడలో కార్యాలయంలో కూర్చుని గొప్పలు  చెప్పుకుంటున్నారని, రైతుల సమస్యలు మాత్రం పట్టించుకోవట్లేదని పార్టీ నేత జోగి రమేష్‌ ఆరోపించారు.

వైసీపీ నేతల ఆందోళన..
అక్రమంగా అరెస్ట్‌ చేసిన పార్థసారధి, జోగి రమేశ్‌లతో పాటు రైతులను విడుదల చేయాలని వైసీపీ నేతలు గన్నవరం పోలీస్‌ స్టేషన్‌ ముందు ఆందోళన చేపట్టారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top