‘రథయాత్రకు అడ్డొస్తే.. చక్రాల కింద తొక్కిస్తాం’

West Bengal BJP Leader Locket Chatterjee Sensational Comments - Sakshi

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు లాకెట్‌ ఛటర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ బీజేపీ చేపట్టే రథయాత్రను అడ్డుకుంటే రథ చక్రాల కింద నలిగిపోతారని హెచ్చరించారు.

ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకే రథయాత్రలు నిర్వహిస్తున్నామన్నారు. బీజేపీ చేపట్టనున్న రథయాత్రలను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.

రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు మూడు రథయాత్రలను బీజేపీ ప్లాన్‌ చేసింది.  డిసెంబర్ 5,7,9 తేదీల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రారంభించబోతున్నారు. రాష్ట్రంలోని 42 లోక్‌ సభ నియోజకవర్గాల్లో ఈ యాత్రలు నిర్వహించనున్నారు. రథయాత్రల ముగింపు సందర్భంగా కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. ఈ ర్యాలీలో ప్రధాని మోదీ సైతం పాల్గొనే అవకాశం ఉంది.

కాగా, లాకెట్ ఛటర్జీ వ్యాఖ్యలపై తృణమూల్‌ కాంగ్రెస్‌ మండిపడింది. రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకే బీజేపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించింది. బెంగాల్‌ ప్రజలపై మతతత్వ ఎజెండా రుద్దడమే బీజేపీ ప్రధాన లక్ష్యమని టీఎంపీ సెక్రటరీ జనరల్‌ పార్థ ఛటర్జీ విమర్శించారు. అందుకే బీజేపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు.  బీజేపీ విభజన రాజకీయాలను ప్రజలే తిప్పికొడతారని ఆయన అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top