జనసేనలోకి వంగవీటి రాధా
సాక్షి,విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ త్వరలో జనసేనలో చేరనున్నారు. మంగళవారం ఉదయం పటమటలోని పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆయన్ను వంగవీటి రాధా కలిసి చర్చలు జరిపారు. సోమవారం కూడా ఆయన చర్చలు జరిపిన విషయం విదితమే. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్న రాధా వచ్చే నెల నాలుగు లేదా ఐదు తేదీల్లో ఆ పార్టీ వీడి జనసేనలో చేరతారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. కాగా ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన వంగవీటి రాధా ఆ పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా పనిచేశారు.
వంగవీటి రాధాకు చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తారని ఆయన టీడీపీలో చేరే సమయంలో ప్రచారం జరిగింది. ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోవడంతో రాధా జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కాగా ఇప్పటి వరకు ఆయన ఏపార్టీలోనూ నిలదొక్కుకోలేకపోయారని, పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొనరనే ఆరోపణలు ఉన్నాయి. జనసేనలో ఎంతమేరకు నెగ్గుకు వస్తారనేది వేచి చూడాల్సి ఉంది.