Sakshi News home page

కారుకు ఓటేస్తే  బీజేపీకి వేసినట్లే!

Published Sat, Oct 19 2019 2:19 AM

Uttam,Revanth Reddy In Huzurnagar By-Election Roadshow - Sakshi

సాక్షిప్రతినిధి, సూర్యాపేట: సీఎం కేసీఆర్, ప్రధానమంత్రి మోదీ దోస్తులని, టీఆర్‌ఎస్‌ పార్టీ కారు గుర్తుకు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్లేనని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డితో కలసి నియోజవర్గంలోని పాలకీడు, నేరేడుచర్ల, గరిడేపల్లి, హుజూర్‌నగర్‌ మండలాల్లో రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ, కేసీఆర్‌ ముస్లింల వ్యతిరేకి అని, వారికి వ్యతిరేకంగా బీజేపీ పార్లమెంట్‌లో పెట్టే ప్రతి బిల్లుకు మద్దతు ఇస్తున్నారని అన్నారు.

ఈనెల 21న జరిగే ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు టీఆర్‌ఎస్‌ను ఓడించాలన్నారు.  హుజూర్‌నగర్‌లో చిన్న తుంపర వర్షానికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభకు రాలేదని, ఇక్కడి ప్రజలకు ఏమి చెప్పాలో తెలియక, మొఖం చూపించలేక సభకు రాలేదని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి విమర్శించారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్‌యాదవ్, టీపీసీసీ కార్యదర్శి పటేల్‌ రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement