‘బొటాబొటి ఓట్లతో గెలిచిన వ్యక్తి... ఎంపీలను గెలిపిస్తాడట’

TRS Leader Gutha Sukhender Reddy Critics Uttam Kumar Reddy - Sakshi

టీపీసీసీలో అసమర్థ నాయకత్వం ఉంది

ఉత్తమ్‌కుమార్‌పై గుత్తా ఫైర్‌

సాక్షి, నల్గొండ : తెలంగాణ కాంగ్రెస్‌లో అసమర్థ నాయకత్వం ఉందని టీఆర్‌ఎస్‌ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఆ పార్టీపై నమ్మకం లేకనే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, నేతలు కేసీఆర్‌ సమక్షంలో పార్టీలో చేరుతున్నారని స్పష్టం చేశారు. చేజారిపోతున్న ఎమ్మెల్యేలను కాపాడుకొనే దమ్ములేదుగానీ.. ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తామని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ మాట్లాడుతున్నారని చురకలంటించారు. శనివారం అటవీ సంస్థ చైర్మన్‌ బండ నరేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి, భాస్కరరావుతో కలిసి ఆయన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు.

‘మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బొటాబొటి ఓట్లతో ఉత్తమ్‌ బయటపడ్డారు. కోమటిరెడ్డి సోదరులకు మతి భ్రమించింది. ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. నల్గొండ ఎంపీగా అభ్యర్థిగా వేమిరెడ్డి నర్సింహ్మారెడ్డిని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. కార్యకర్తలు సమష్టిగా పనిచేసి భారీ మెజారిటీతో ఆయనను గెలిపించాలి. 3 సార్లు ఎంపీగా ప్రజలకు సేవలందించాను. రైతు సమన్వయ సమితి చైర్మన్‌గా రైతులకు సేవ చేసే భాగ్యాన్ని కేసీఆర్‌ కల్పించారు. నన్ను ఎమ్మెల్సీ ప్రకటించినందుకు కేసీఆర్‌కు రుణపడి ఉంటాను’ అని గుత్తా చెప్పారు. నర్సింహ్మారెడ్డి 25న నామినేషన్‌ దాఖలు చేస్తాడని తెలిపారు. కాంగ్రెస్‌ నుంచి నల్గొండ ఎంపీ అభ్యర్థిగా ఉత్తమ్‌ పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top