రెండో విడతకు రెడీ

Tomorrow Telangana ZPTC And MPTC Second Phase Elections - Sakshi

హన్మకొండ: జిల్లా, మండల ప్రజాపరిషత్‌ ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా రెండో విడత పోలింగ్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈమేరకు సిబ్బందికి పోలింగ్‌ సామగ్రిని గురువారం అందించనున్నారు. ధర్మసాగర్, వేలేరు మండలాల ఉద్యోగులకు ధర్మసాగర్‌లోని జూనియర్‌ కాలేజీలో, ఐనవోలు మండల ఉద్యోగులకు వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టరేట్‌లోని ఈవీఎం గోదాంలో సామగ్రి పంపిణీకి ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం 7.30 గంటల నుంచి పోలింగ్‌ సిబ్బంది రిపోర్టు, సామగ్రి పంపిణీ ప్రక్రియ మొదలవుతుంది. సాయంత్రానికి సిబ్బంది పోలింగ్‌ స్టేషన్లకు చేరుకుంటారు. ఇక 10వ తేదీన శుక్రవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమవుతుంది.

3 జెడ్పీటీసీ స్థానాలు, 34 ఎంపీటీసీ స్థానాలు
వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని మూడు జెడ్పీటీసీ స్థానాలు, 34 ఎంపీటీసీ స్థానాలకు రెండో విడత ప్రాదేశిక ఎన్నికలు జరగనున్నాయి. అధికారులు ఇప్పటికే పోలింగ్‌ స్టేషన్లను పరిశీలించారు. ఈ దఫాలో 86,465 మంది ఓటర్లకు గాను 184 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. కాగా, మూడు జెడ్పీటీసీ స్థానాలకు 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ధర్మసాగర్‌ జెడ్పీటీసీ స్థానానికి ఆరుగురు, వేలేరు జెడ్పీటీసీ స్థానానికి నలుగురు, ఐనవోలు జెడ్పీటీసీ స్థానానికి ఐదుగురు పోటీ పడుతున్నారు. ఇక మూడు మండలాల్లోని 34 ఎంపీటీసీ స్థానాలకు గాను 98 మంది బరిలో ఉన్నారు. ఇందులో ఐనవోలు మండలం నుంచి ఇద్దరు ఎంపీటీసీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇవి కాకుండా ధర్మసాగర్‌ మండలంలోని 13 ఎంపీటీసీ స్థానాలకు 41 మంది, వేలేరు మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలకు  21 మంది, ఐనవోలు మండలంలో 13 ఎంపీటీసీ స్థానాలకు 36 మంది పోటీలో ఉన్నారు.

సామగ్రి పంపిణీ.. పోలింగ్‌ పర్యవేక్షణ
పోలింగ్‌ ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రశాంతంగా సాగేలా పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులను నియమించారు. ఈ మేరకు వీరు పోలింగ్‌ సామాగ్రి పంపిణీతో పాటు పోలింగ్‌ సరళిని పర్యవేక్షిస్తారు. ధర్మసాగర్‌ మండలానికి ఎస్సారెస్పీ డిప్యూటీ కలెక్టర్‌ గణేశ్, ఐనవోలుకు డీఆర్డీఓ రాము, వేలేరుకు మెప్మా పీడీ కృష్ణవేణి ప్రత్యేక అధికారులుగా నియమితులయ్యారు.

గెలుపే లక్ష్యంగా వ్యూహాలు
జెడ్పీ, మండల ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా రెండో విడత పోలింగ్‌ శుక్రవారం జరగనుండగా ప్రచారం బుధవారం సాయంత్రంతో ముగిసింది. ఎన్నికల్లో విజయం కోసం పార్టీలు, అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తించారు. డప్పుచప్పుళ్ల మద్య అభ్యర్థులు, పార్టీ అగ్రనాయకులు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. ప్రచార రథాలు, మైకులతో గ్రామాల వీధులు హోరెత్తాయి. జెడ్పీ, మండల ప్రాదేశిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా వ్యూహా, ప్రతివ్యూహాలతో ముందుకు సాగారు. పోలింగ్‌ సమీపించడంతో ప్రధానంగా ఎంపీటీసీ అభ్యర్థులు తమకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలు ఉపయోగిస్తున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకుంనేందుకు  మద్యం, డబ్బు, ఇతరత్రా తాయిలాలను ఎర వేస్తున్నారని సమాచారం అందుతోంది.

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌
ఐనవోలు: ఐనవోలు మండలంలో శుక్రవారం పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని ఎంపీడీఓ నాగపురి స్వరూప తెలిపారు. హన్మకొండలోని ఎంపీడీఓ కార్యాలయాన్ని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ పరిశీలించి ఏర్పాట్లపై ఆరా తీయగా ఆమె వివరించారు. శుక్రవారం జరగనున్న రెండో విడత ప్రాదేశిక ఎన్నికల సందర్భంగా ఐనవోలు మండలంలోని 66 పోలింగ్‌ కేంద్రాల్లో విధులు నిర్వర్తించడానికి 180 మంది పీఓ, ఏపీఓలు 180తో పాటు ఇతర సిబ్బంది 300 మం దిని నియమించినట్లు ఎంపీడీఓ కలెక్టర్‌కు వివరించారు. అలాగే, ఒక్క ఏసీపీ, ఇద్దరు సీఐలు, ఏడుగురు ఎస్సైలు, 18 మంది ఏఎస్సై, హెచ్‌సీలు, 32 మంది హోంగార్డులు, 8 మంది ఏఆర్‌లు, 34 మంది కానిస్టేబుళ్లతో పాటు 12 మంది మహిళా పోలీసులు విధుల్లో పాల్గొంటారని ఎస్సై నర్సింహరావు తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top