ప్రాదేశిక ఎన్నికలకు నేడు నోటిఫికేషన్‌ | Telangana MPTC And ZPTC Elections Notification | Sakshi
Sakshi News home page

ప్రాదేశిక ఎన్నికలకు నేడు నోటిఫికేషన్‌

Apr 22 2019 8:40 AM | Updated on Apr 22 2019 8:40 AM

Telangana MPTC And ZPTC Elections Notification - Sakshi

నిజామాబాద్‌అర్బన్‌: స్థానిక సంస్థల సమరానికి నేడు తెర లేవనుంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సమరం మొదలు కానుంది. జిల్లాలో తొలి విడత ఎన్నికలకు సంబంధించి నేడు (సోమ వారం) నోటిఫికేషన్‌ జారీ కానుంది. నేటి నుం చే నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభం కా నుంది. తొలి విడతలో నిజామాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని 8 మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయి. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.

ఈసారి మండల కేంద్రాల్లోనే ఎంపీటీసీఅభ్యర్థులతో పాటు జెడ్పీటీసీ అభ్యర్థుల కోసం నామినేషన్ల స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గతంలో జెడ్పీటీసీ అభ్యర్థులు జిల్లా కేంద్రంలోని నామినేషన్‌ కేంద్రాల్లో నామపత్రాలు సమర్పించాల్సి ఉండేది. అయితే, ఈసారి మండల కేంద్రాల్లోనే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. జెడ్పీటీసీ నామినేషన్ల స్వీకరణకు మండలానికో రిటర్నింగ్‌ ఆఫీసర్‌ను నియమించారు. ఇక, ముగ్గురు ఎంపీటీసీలకు గాను ఒక రిటర్నింగ్‌ అధికారి, ఒక సహాయ రిటర్నింగ్‌ అధికారిని కూడా ఏర్పాటు చేశారు. వీరు అభ్యర్థుల నుంచి నామపత్రాలను స్వీకరిస్తారు. నామినేషన్‌ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
 
8 జెడ్పీటీసీలు, 100 ఎంపీటీసీలకు.. 
మొదటి విడతలో నిజామాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో నిజామాబాద్, మోపాల్, డిచ్‌పల్లి, ఇందల్‌వాయి, ధర్పల్లి, సిరికొండ, మాక్లూర్, నవీపేట మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలోని 8 జెడ్పీటీసీ, 100 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు తొలి విడతలో జరగనున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే జెడ్పీటీసీ అభ్యర్థి ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే రూ.2500, ఇతరులు అయితే రూ.5 వేలు డిపాజిట్‌ చెల్లించాలి. ఎంపీటీసీగా పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1250, ఇతరులు రూ.2,500 డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement