Telangana MLC Elections Live Updates: తెలంగాణలో ముగిసిన ఎమ్మెల్సీ పోలింగ్‌

Telangana Localbody MLC Elections 2021 Live Updates - Sakshi

04:00 PM

తెలంగాణలో మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న పోలింగ్‌ ముగిసింది. ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్‌, మెదక్‌ జిల్లాలోని జెడ్పీటీసీల, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చెదురుమదురు ఘటనలు తప్ప ప్రశాంతంగా పోలింగ్‌ జరిగింది. 14న కౌంటింగ్‌ జరగనుంది.

కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎనిమిది కేంద్రాలలో పోలింగ్ పూర్తవగా..మొత్తం ఓట్లు 1324 ఉంటే 1320 ఓట్లు పోలయ్యాయి.  అంటే 99.70 శాతం పోలింగ్ నమోదు  అయ్యింది. బీజేపీ ఎంపీ బండి సంజయ్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు ఓటు  వేయలేదు. మరో వ్యక్తి చనిపోగా, సిరిసిల్లలో అనారోగ్యంతో ఓ ఎంపీటీసీ ఓటు వేయలేదు.

 స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అలుగుబెల్లి రవీందర్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకోలేదు.

ఆదిలాబాద్‌లో ఎమ్మెల్సీ  ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. రికార్డ్‌ స్థాయిలో 91.78% పోలింగ్‌ నమోదైంది.

భువనగిరిలో 197 ఓట్లకు 197 ఓట్లు పోల్‌ అయ్యాయి.

ముగిసిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 95 శాతం పోలింగ్ నమోదైంది. 

ఖమ్మం-మొత్తం 348ఓట్లకు గాను 338 ఓట్లు పోలింగ్
కల్లూరు-మొత్తం 115 ఓట్లకు గాను 114 ఓట్లు పోలింగ్
కొత్తగూడెం-మొత్తం 221ఓట్లకు గాను 209 ఓట్లు పోలింగ్
భద్రాచలం-మొత్తం 84ఓట్లకు గాను 79 ఓట్లు పోలింగ్..

మొత్తం 768ఓట్లకు గాను 740ఓట్ల పోలింగ్

నల్లగొండలో మొత్తం 235 ఓట్లకు గాను 229 ఓట్లు పోలయ్యాయి.

సూర్యాపేట జిల్లాకేంద్రం లో 186 ఓట్లకు గానుక 183 పోలయ్యాయి.

ఉమ్మడి మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్ ముగిసింది. జహీరాబాద్, నారాయణఖేడ్, తూప్రాన్, సిద్దిపేట పోలింగ్ కేంద్రల్లో 100శాతం పోలింగ్ నమోదైంది. కేసీఆర్ మినహా అందరూ ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

మొత్తం 1026 ఓటర్లకు గానూ, 1018 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

► సిరిసిల్లలో  99.50 శాతం పోలింగ్ నమోదైంది. మొత్త 201 ఓట్లు ఉండగా.. 200 ఓట్లు పోలయ్యాయి.

03:00 PM

కరీంనగర్ ఎమ్మెల్సీ ఫలితాలు టీఆర్‌ఎస్‌ వైపు ఏకపక్షమే అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పదవులు ఇస్తే సీఎం కేసీఆర్ దేవుడు లేకపోతే దయ్యంలా చూస్తారా అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ శిఖండీ రాజకీయాలు చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఖమ్మం ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిరసన వ్యక్తం చేశారు. ఓడిపోతామనే భయంతో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడుతుందని ఆరోపించారు. ఓటు హక్కు వినియోగించుకున్న టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలకు ఏం పని లేదని మండిపడ్డారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జడ్పీ చైర్మన్ కమల రాజ్, ఎమ్మెల్యే  కందాల ఉపేందర్ రెడ్డి  పోలింగ్ కేంద్రంలో మూడు గంటలు ఎలా ఉంటారని ప్రశ్నించారు. పోలింగ్ కేంద్రంలో ఉండి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నా.. అధికారులు ప్రేక్షక పాత్ర వహించారని మండిపడ్డారు.

02:00 PM

కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా  మధ్యాహ్నం రెండు గంటల వరకూ 76.06 శాతం పోలింగ్ నమోదు అయ్యింది

యాదాద్రి భువనగిరి జిల్లా: చౌటుప్పల్ ఎన్నికల కేంద్రంలో 106 మందికి గాను 82 మంది ఓటు హక్కులను వినియోగించుకున్నారు.

నల్లగొండ : ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు 83.63 % నమోదదైంది

01:05 PM

1 గంట వరకు ఖమ్మంలో 58శాతం పోలింగ్ నమోదు

► మెదక్‌లో ఎమ్మెల్యే మాణికరావు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

► సంగారెడ్డిలో మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. కేసీఆర్‌ వరిధాన్యం పేరిట డైవర్ట్‌ పాలిటిక్స్‌కు తెరలేపారని విమర్శించారు.

12:05 PM

► ఉమ్మడి మెదక్‌లో మధ్యాహ్నం 12 గంటల వరకు 42.1 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. 

► నల్లగొండలో మధ్యాహ్నం వరకు 42.88 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. 

► సూర్యపేట జిల్లా పోలింగ్‌ కేంద్రంలో మధ్యాహ్నం వరకు  43.28 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. 

► యాదాద్రి భువనగిరి జిల్లాలో 64.97 శాతం, చౌటుప్పల్‌లో 66.98 శాతం ఓటింగ్‌ నమోదయ్యింది. 

► సంగారెడ్డిలో అందోల్‌ డివిజన్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

► సిద్ధిపేటలో తొలిసారి స్థానిక సంస్థల ఎన్నికలలో మంత్రి హరీష్‌ రావు తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలిసారి ఓటు వేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రజా నిధులు తప్పనిసరిగా ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు.

► నిర్మల్‌లో 81 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. 

► ఆదిలాబాద్‌లో 1గంట వరకు 77 శాతం ఓటింగ్‌ నమోదయ్యింది.

11:45 AM

► సూర్యాపేట జిల్లా హుజూర్‌ నగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

► భువనగిరి పోలింగ్‌ కేంద్రంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డి తన ఓటుహక్కు వినియోగించుకున్నారు.

► కరీంనగర్‌ జడ్పీహాలులో మంత్రి గంగుల కమలాకర్‌ తన ఓటుహక్కు వినియోంచుకున్నారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. కొంత మంది కళ్లు మండుతున్నాయి. మాకు బలంలేదని బీజేపీ, కాంగ్రెస్‌లు ఎన్నికల నుంచి తప్పుకున్నాయి. అవి మాకు శుభసూచకమని గంగుల అన్నారు.

 టీఆర్‌ఎస్‌ కుటుంబ సభ్యులలో చిచ్చుపెట్టాలని కొందరు ఎన్నికలు తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇండిపెండెంట్‌గా పోటిచేసిన రవీందర్‌ సింగ్‌కు ఈటల మద్దతు తెలుపుతున్నారని అన్నారు. ఈటల శిఖండి రాజకీయాలు మానుకోవాలని గంగుల హితవు పలికారు. 

11: 15 AM

► రాజన్న సిరిసిల్లలోని జిల్లా పరిషత్‌ కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

► మంచిర్యాల బెల్లంపల్లిలో పోలింగ్‌ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్‌ భారతి హోళీకేరి పరిశీలించారు.

10: 48 AM

► ఖమ్మం పోలింగ్‌ కేంద్రంలో కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.

► నల్లగొండలో స్వతంత్ర అభ్యర్థి వంగూరి లక్ష్మయ్య తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

10: 15 AM

►  మిర్యాలగూడలోని ప్రభుత్వ పాఠశాలలోని ఎన్నికల కేంద్రాన్ని స్థానిక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోటిరెడ్డి పరిశీలించారు.

►  నల్లగొండలోని బాలికల జూనియర్‌ కాలేజీలో జెడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌ రెడ్డి, చిన్నపరెడ్డి తమ ఓటు హక్కును వినియోంచుకున్నారు. 

09: 25 AM

► కోరుట్ల ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌ ఓటు హక్కును వినియోంచుకున్నారు. 

► మంచిర్యాల జిల్లా ప్రజాపరిషత్‌లో ఎమ్మెల్యే బాల్క సుమన్‌, దివాకర్‌రావు, ఎంపీటీసీ, కౌన్సిలర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. 

ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రాన్ని జెడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మీ, ఎమ్మెల్యే ఆత్రంసక్కు, ఎమ్మెల్సీ అభ్యర్థి దండె విఠల్‌ సందర్శించారు. 

09: 15 AM

► యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఆలేరు, శ్రీమతి గొంగిడి సునీత మహేందర్‌ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

► నల్లగొండ జిల్లాలోని బాలికల కాలేజ్లో ఎక్స్ అఫిషియో మెంబర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

08: 25 AM

► కరీంనగర్‌లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి  అభ్యర్థి రవీందర్‌ సింగ్‌ ఎన్నికల కేంద్రానికి చేరుకున్నారు.

► సంగారెడ్డిలో కాంగ్రెస్‌ అభ్యర్థి నిర్మల జగ్గారెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

► కరీంనగర్‌లో ఇండిపెండెంట్‌ అభ్యర్థి మాజీ మేయర్‌ రవీందర్‌ సింగ్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

08: 15 AM

 నల్లగొండ జిల్లాలో.. కాంగ్రెస్‌ మున్సిపల్‌  ఫ్లోర్‌ లీడర్‌ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, ఆయన భార్య ఓటు హక్కును వినియోంచుకున్నారు. 

► ఆదిలాబాద్‌ ఎమ్మెల్సీ స్థానానికి గాను.. నిర్మల్‌లోని జిల్లా పరిషత్‌ కార్యాలయంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

08: 02 AM

ఆదిలాబాద్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్‌ ప్రక్రియ  ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎన్నికల కేంద్రానికి చేరుకున్నారు. థర్మల్ స్క్రీనింగ్‌ అనంతరం ఎమ్మెల్యే ఓటు వేయడానికి వెళ్లారు.

► నల్లగొండలో ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు ఓటింగ్‌ సెంటర్‌కు చేరుకుంటున్నారు.

 కరీంనగర్‌ జిల్లాలో ఓటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. 

సాక్షి, హైదరాబాద్‌: 6 స్థానాలు.. 26 మంది అభ్యర్థులు.. 5326 మంది ఓటర్లు..37 పోలింగ్‌ కేంద్రాలు. శాసన మండలి స్థానిక సంస్థల కోటా ఎన్నికల పోలింగ్‌ శుక్రవారం ఉదయం 8గం. నుంచి సాయంత్రం 4 గం. వరకు జరగనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి ఐదు జిల్లాలు.. ఆదిలాబాద్, మెదక్, నల్లగొండ, ఖమ్మం లో ఒక్కో స్థానానికి, కరీంనగర్‌లో రెండు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

2,329 మంది పురుష ఓటర్లు, 2,997 మహిళా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఓటు హక్కును కలిగి ఉండగా, తొలిసారిగా.. ఎన్నికలు జరిగే ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా ఓటు హక్కు కల్పించారు. ఓటర్లలో ఎంపీటీసీ సభ్యులు, మున్సిపల్‌ కౌన్సిలర్లే సుమారు మూడొంతుల మందికి పైగా ఉండటంతో అభ్యర్థుల గెలుపోటముల్లో వీరి పాత్ర కీలకం కానుంది.

ఇందులో టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు ఎక్కువ మంది ఉండటంతో ఎన్నికలు జరిగే ఆరు స్థానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. మెదక్, ఖమ్మంలో కాంగ్రెస్‌ అభ్యర్థులు, ఇతర చోట్ల స్వతంత్రుల నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పోటీ ఎదుర్కొంటున్నారు. అందరు కోవిడ్‌ నిబంధనలను పాటించాలని సీఈఓ శశాంక్‌ గోయల్‌ కోరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top